మిడ్జిల్, అక్టోబర్ 23 : మండలంలో ట్రాఫిక్ సమస్యతో వాహనదారులు, ప్రజలు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. మండలంలో వాహనదారులు ఇష్టారాజ్యంగా ప్రధాన రహదారులపై వాహనాలు పార్కింగ్ చేయడంతోపాటు పలువురు ఇక్కట్లకు గురవుతున్నారు. ట్రాఫిక్ను నియంత్రించే పోలీసులు స్టేషన్లకే పరిమితం కావడంతో సమస్య జఠిలంగా మారింది. మ హబుబ్నగర్-కల్వకుర్తి ప్రధాన రహదారిపై మిడ్జిల్ ఉండడంతో పలువురు నాయకులు, ప్రజలు ట్రాఫిక్ జాంలో ఇరుకొని ఇబ్బందులు చవి చూస్తున్నారు.
మండలంలోని పలు ప్రధాన రహదారులు, జడ్చర్ల, తలకొండపల్లి, కల్వకుర్తి, కొత్తుర్ వెళ్లే రహదారులపై పలువురు చిరు వ్యాపారులు తమ వ్యాపారులు క్రయ విక్రయాలు జరుపుకొంటున్నారు. అంతేకాకుండా వాహనాలు నిత్యం వివిధ గ్రామాలు, పట్టణాలకు వెళ్లే ప్రయాణికులను ఎక్కించుకోవడం కోసం ఇష్టానుసారంగా రోడ్లపై అడ్డగోలుగా పార్కింగ్ చేస్తున్నారు. దీంతో రోడ్లపై ట్రాఫిక్ జాం అవుతున్నది. మహబుబ్నగర్-కల్వకుర్తి ప్రధాన రహదారిపై బస్సులు నిల్వకుండా రోడ్డుపై నిలుపడంతో సమస్య మరింత తీవ్రమవుతున్నది.
పోలీస్ అధికారుల పనితీరు లోపంతో మండలంలో ట్రాఫిక్ సమస్య తీవ్ర రూపం దాల్చుతున్నది. అడపాదడపా మహబుబ్నగర్-కల్వకుర్తి ప్రధాన రహదారిపై వీఐపీలు, మంత్రులు, ఉన్నతాధికారులు వస్తున్నారనే సమాచారం అందడంతో రోడ్లపై వాహనదారులను పరుగులు పెట్టిస్తారు..తప్పా మిగతా రోజుల్లో షరామామూలే. మండలంలో ట్రాఫిక్ను అరికట్టేందుకు పోలీసులు ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీగా ఉండే బస్టాండ్ లో విధులు నిర్వహించాలి. రోడ్లపై అడ్డ్డదిడ్డంగా నిలిపే వాహనదారులపా చర్యలు తీసుకోవాలి. రోడ్లపై నిబంధనలకు విరుద్దంగా వ్యాపారులు కొనసాగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటే కొంతమేరకు ట్రాఫిక్ నియంత్రణలోకి వస్తున్నది. జడ్చర్ల, కల్వకుర్తి, తలకొండపల్లి, వివిధ గ్రామాల వైపు ప్రయాణించే వాహనాలకు ప్రత్యేక స్థలం చూపించి వాహనాలను పార్కింగ్ చేసుకునేలా డ్రైవర్లకు సలహాలు, సూచనలు అందిస్తే ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టవచ్చు.
వాహనదారులతో సమావేశం ఏ ర్పాటు చేసి వారికి అవగాహన కల్పిస్తాం. ప్రతిఒక్కరూ వాహనాలు ఇష్టానుసారం గా పార్కింగ్ చేయకుండా చర్యలు తీసుకుంటాం. రోడ్డుకు ఇరువైపులా చిరువ్యాపారులకు అవగాహన కల్పించి, రోడ్డుకు గ్రిల్స్ అవతల వైపు ఏర్పాటు చేస్తాం. నిబంధనలకు విరుద్దంగా వ్యహరిస్తే చర్యలు తప్పవు.
– రాంలాల్నాయక్, ఎస్సై