జడ్చర్లటౌన్, డిసెంబర్ 7: జడ్చర్ల మండలం మాచారం గ్రామ శివారులో 44వ జాతీయరహదారిపై మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కారుడ్రైవర్ అతివేగంగా డ్రైవింగ్ చేస్తూ రోడ్డుపై ఆగిన కారును ఢీకొట్టటంతోపాటు ముందు వెళ్తున్న స్కూటీని ఢీకొట్టాడు. దీంతో స్కూటీపై వెళ్తున్న తండ్రి, కూతురుకు తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని మర్రిచెట్టుతండా గ్రామ పంచాయతీ పరిధిలోని చౌటగడ్డతండాకు చెందిన కోట్యానాయక్ తండాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రైవేటు స్వీపర్గా పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం తన కూతురు మణిశ్రీ గొంతునొప్పితో బాధపడుతుండగా జడ్చర్లలోని దవాఖానలో చూపించేందుకుగానూ స్కూటీపై బయలుదేరారు. మాచారం గ్రామ శివారులోకి రాగానే స్కూటీపై వెళ్తున్న వారిని ఓ కారు వెనుక నుంచి వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో తండ్రి,కూతురుకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు గుర్తించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అంబులెన్స్లో మహబూబ్నగర్ సర్కారు దవాఖానకు తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని సిటీ న్యూరో దవాఖానకు తరలించారు. ప్రస్తుతం కూతురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాలానగర్లో గురుకులంలో ఇంటర్మీడియట్ చదువుతున్న మణిశ్రీ తండాలో జరుపుకొనే పోచమ్మ పండుగ కోసం ఇంటికొచ్చిందని, తిరిగి గురుకులానికి వెళ్లే నేపథ్యంలో గొంతునొప్పితో బాధపడుతున్న మణిశ్రీ జడ్చర్ల దవాఖానలో చూయించుకుందామని వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని తండావాసులు తెలిపారు. ఈ విషయంపై జడ్చర్ల సీఐ రమేశ్బాబును వివరణ కోరగా ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. రోడ్డు ప్రమాదంలో తండ్రి,కూతురు తీవ్రంగా గాయపడిన విషయాన్ని తెలుసుకున్న జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి వెంటనే హైదరాబాద్లోని సిటీ న్యూరో దవాఖానకు వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. చికిత్స నిమిత్తం రూ.50 వేలు ఆర్థిక సాయం చేశారు. కుటుంబసభ్యులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్ నాయకులు అభిమన్యురెడ్డి, శ్రీనునాయక్, విజయ్, శ్రీను, రమేశ్ ఉన్నారు.