అయిజ, నవంబర్ 18 : జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఉత్తనూరులో క్రీడా సౌరభం నెలకొన్నది. గ్రామంలోని మినీ స్టేడియంలో గురువారం ధన్వంతరి వేంకటేశ్వర స్వామి దేవస్థాన కమిటీ సౌజన్యంతో తెలంగాణ అంతర్జిల్లాల అండర్-19 జూనియర్ బాస్కెట్బాల్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను ప్రముఖ వ్యాపారవేత్త పులకుర్తి శ్రీనాథ్రెడ్డితో కలిసి రాష్ట్ర బాస్కెట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నార్మన్ ఐజాక్ ప్రారంభించారు. రాష్ట్రంలోని 10 జిల్లాల నుంచి 20 బాల, బాలికల జట్లు పాల్గొన్నాయి. తొలి రోజు లీగ్ మ్యాచ్లు హోరాహోరీగా జరిగాయి.
క్రీడాకారులు రాణించాలి : ఐజాక్
బాస్కెట్బాల్ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని రాష్ట్ర బాస్కెట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నార్మన్ ఐజాక్ కాంక్షించారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు బాస్కెట్బాల్ క్రీడపై ఆసక్తి పెంపొందించేలా గద్వాల జిల్లాలో అంతర్జిల్లాల క్రీడాకారులకు చాంపియన్షిప్ పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ టోర్నీ మూడ్రోజులపాటు కొనసాగుతుందని తెలిపారు. ప్రతిభ చాటిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపిక చేస్తామని ఆయన పేర్కొన్నారు. టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ జెడ్పీటీసీ తిరుమల్రెడ్డి సహకారంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. శుక్రవారం జరిగే పోటీలకు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, జెడ్పీ చైర్పర్సన్ సరిత, ఎమ్మెల్యే అబ్రహం, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరవుతారని తెలిపారు.
నేడు మంత్రి శ్రీనివాస్గౌడ్ రాక
ఉత్తనూర్ గ్రామంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో జరుగుతు న్న అండర్-19 జూనియర్ బాస్కెట్బాల్ చాంపియన్షిప్ పో టీలను తిలకించేందుకు శుక్రవారం క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ హాజరుకానున్నారు. ఆయనతోపాటు గద్వాల జెడ్పీ చైర్పర్సన్ సరిత, ఎమ్మెల్యే అబ్రహం, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ప్రజాప్రతినిధులు హాజరవుతున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నార్మన్ ఐజాక్ తెలిపారు. వీరికి స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ తిరుమల్రెడ్డి, మాజీ ఎంపీపీ సుందర్రాజు, పీఏసీసీఎస్ మాజీ అధ్యక్షుడు రాముడు, బాస్కెట్బాల్ కార్యదర్శి నీలిమ, మాజీ జెడ్పీటీసీ తిరుమల్రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, బాస్కెట్బాల్ కోచ్లు, క్రీడాకారులు పాల్గొన్నారు.