మహబూబ్నగర్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి జిల్లాలో మద్యం దుకాణాలకు భారీగా డిమాం డ్ నెలకొన్నది. ఉమ్మడి జిల్లా పరిధిలోని మొత్తం 230 దుకాణాలకుగానూ 4,713 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దుకాణానికి సుమారు 20 దరఖాస్తుల చొప్పుల వచ్చాయి. 4,713 దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి నేరుగా రూ.94.26 కోట్ల ఆదాయం సమకూరింది. మద్యం దుకాణాల కోసం రూ.2 లక్షలు తిరిగి చెల్లించని దరఖాస్తు ఫీజుగా ప్రభుత్వం నిర్ణయించినా భారీగా పోటీ నెలకొన్నది. 2019 నుంచి అమలవుతున్న కొత్త మద్యం పాలసీ రెండేండ్ల గడువు అనంతరం ముగిసింది. ఈసారి మద్యం దుకాణాల్లోనూ రిజర్వేషన్లను కల్పించింది. గౌడ కులస్తులకు 15, ఎస్సీలకు 10, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఈ నెల 9వ తేదీ నుంచి అన్ని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించగా.. గురువారంతో ముగిసింది. చివరి రోజు భారీగా దరఖాస్తులు వచ్చాయి. సాయంత్రం 5 గంటలలోపే భారీగా క్యూలైన్ ఏర్పడింది.
మహబూబ్నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో రాత్రి 9 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించారు. 2019లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,383 దరఖాస్తులు రాగా.. ఈ ఏడాది 1,330 దరఖాస్తులు అదనంగా వచ్చాయి. 2019తో పోలిస్తే ఈ సారి రూ.26.60 కోట్ల అదనపు ఆదాయం వచ్చింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాలతోపాటు హైదరాబాద్ కమిషనర్ కార్యాలయంలోనూ ఉమ్మడి జిల్లాకు చెందిన 15 మంది దరఖాస్తులు చేసుకున్నారు. కాగా శనివారం లక్కీ డ్రా ద్వారా ఉమ్మడి జిల్లాలోని 230 దుకాణాలను ఎవరు చేజిక్కించుకుంటారో తెలిసిపోనున్నది. జోగుళాంబ గద్వాల జిల్లాలో 36 దుకాణాలకు 987, వనపర్తి జిలాలో 37 దుకాణాలకు 694, నాగర్కర్నూల్ జిల్లాలో 67 దుకాణాలకు 1,507, మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లో 90 దుకాణాలకు 1,525.. ఇలా మొత్తం 230 దుకాణాలకు 4,713 దరఖాస్తులు వచ్చాయి.