మహబూబ్నగర్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నాలాల ఆక్రమణపై ఉక్కుపాదం మోపాలని, ఆక్రమణలు గుర్తించి వెంటనే తొలగించాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో కలెక్టర్, ఎస్పీ, ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భవిష్యత్లో ఎంతటి వరద వచ్చినా లోతట్టు ప్రాంతా లు జలమయం కాకుండా నాలాలను వెడల్పు చేయాలని సూచించారు.
అనుకోకుండా వరుసగా ఫ్లష్ ఫ్లడ్స్ రావడం వల్లే పాలమూరును వరద ముంచెత్తుతుందన్నారు. సుమారు 67 మంది నాలాలను ఆక్రమించుకుని ఇండ్లు కట్టారని, మరో 32 బఫర్ జోన్లో ఉన్నాయని పేర్కొన్నారు. ఏడాదిలోగా నాలాల వెడల్పు ప్రక్రియ పూర్తి కావాలన్నారు. నాలాలను ఆక్రమించి నిర్మాణాలు చేసుకున్న వారు అధికారులకు సహకరించాలని, ఈ విషయంలో ఎలాంటి రాజకీయం చేయొద్దన్నారు. నాలాలు వెడల్పు చేస్తే రామయ్యబౌళి, బీకే రెడ్డి కాలనీ, శివశక్తినగర్కు వరద నుంచి విముక్తి లభిస్తుందన్నారు.
పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు వర్షాలు తగ్గిన 15 రోజుల్లోగా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. అంతకుముందు కలెక్టర్తో కలిసి మం త్రి శ్రీనివాస్గౌడ్ రామయ్యబౌళిలో పరిశీలించి ప్రజలతో మాట్లాడారు. ఆల్మాస్ ఫంక్షన్హాల్లో బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస శిబిరంలో భోజన ఏర్పాట్లు పరిశీలించారు. బాధితులకు భోజనం ప్యాకెట్లు అందజేశారు.సమావేశంలో కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, ఇరిగేషన్ ఇంజినీర్లు చక్రధరం, దయానంద్, మనోహర్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్, తాసిల్దార్ పార్థసారధి పాల్గొన్నారు.