కల్వకుర్తి/ చారకొండ, అక్టోబర్ 3: రాష్ట్రంలో దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ పాలకులకు సవాల్ విసిరారని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలంలోని 6 గ్రామాలకు చెందిన దళిత బంధు లబ్ధిదారులకు సోమవారం జూపల్లి గ్రామంలో 304 యూనిట్లను (ట్రాక్టర్లు, ట్యాక్సీ క్యాబ్లు, టాటా ఏస్లు, జేసీబీలు) టీఆర్ఎస్ జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి, జెడ్పీ వైస్ చైర్మన్ బాలాజీసింగ్, రాష్ట్ర నాయకుడు గోళి శ్రీనివాస్రెడ్డి, కలెక్టర్ ఉదయ్కుమార్, ఎమ్మెల్సీ కశిరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఎంపీ రాములు, ప్రభుత్వ విప్ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలిసి మంత్రి పంపిణీ చేశారు.
ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ..సామాజిక వివక్షకు గురై, ఆర్థిక లేమితో అష్టకష్టాలు పడిన దళిత బిడ్డలకు సామాజిక ప్రేరణగా దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టి అమలు చేస్తున్న ధైర్యవంతుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు. దళితబంధుకు దళితులు లబ్ధిదారులకు కాదని హక్కుదారులని పునరుధ్ఘాటించారు. వానకాలంలో తెలంగాణలో 65లక్షల ఎకరాల్లో వరిని సాగుచేస్తున్నారని, 65లక్షల ఎకరాల్లో పండిన పంటలో 5,6 లక్షల ఎకరాల్లో పండిన పంటనే మన ఆహారానికి వాడుకుని మిగతా 60లక్షల ఎకరాల్లోని పంటను మిగతా రాష్ర్టాలకు, దేశాలకు ఎగుమతి చేస్తామని పేర్కొన్నారు.
దీన్నే సంపద సృష్టించడమని, ఇలాంటి సంపదను దేశవ్యాప్తంగా సృష్టించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నడుం బిగించాడని చెప్పారు. దేశంలో 40కోట్ల ఎకరాల వ్యవసాయ పొలం ఉందని,వైశాల్యంలో అమెరికాలో భూమిఎక్కువగా ఉన్నప్పటికీ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉన్న భూమి మొత్తం వ్యవసాయానికి అనువుగా ఉండదని చెప్పారు. దేశమంతా రైతులకు ఉచిత కరెంట్ ఇస్తే రూ.1.40లక్షల కోట్లు, రైతుబంధుకు రూ.1.70లక్షల కోట్లు ఖర్చు అవుతుందని వివరించారు.
దేశాన్ని సంపదలో అగ్రగామిగా నిలిపేందుకు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్న క్రమంలో ఆయనకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని దేశ ప్రజలు కోరుతున్నారన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజేశ్కుమార్, దళితబంధు ఈడీ రాంలాల్, ఎంపీపీ నిర్మల, కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, పీఏసీసీఎస్ చైర్మన్ భాస్కర్రావు, విజేందర్గౌడ్తోపాటు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు. దళితబంధు లబ్ధిదారులు పాల్గొన్నారు.
వనపర్తి టౌన్, అక్టోబర్ 3: వనపర్తి జిల్లాను దక్షిణాది రాష్ర్టాల్లోనే అద్భుత సుందరమైన పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంతో పనిచేస్తున్నానని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని నల్లచెరువు ట్యాంక్బండ్పై సద్దుల బతుకమ్మ పండుగ వేడుకల్లో మంత్రి పాల్గొని మహిళలు, చిన్నారులతో బొడ్డెమ్మ, కోలాటాలు వేసి ఉత్సాహపరిచారు.
వనపర్తి జిల్లాకు త్వరలో వ్యవసాయ డిగ్రీ కళాశాల రానున్నదని, సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం అర్ధ చంద్రాకార బైపాస్ రోడ్డు నిర్మాణానికి రూ.73కోట్లు మంజూరు చేస్తూ జీవో విడుదల చేశారన్నారు. వనపర్తిని హైదరాబాద్ తరహాలో తీర్చిదిద్దుతామన్నారు. అంతకుముందు వనపర్తి జిల్లా కేంద్రంలో అమ్మవారి మండపాలను దర్శించి పూజలు చేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్.లోకనాథ్రెడ్డి, అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, ఆశిష్ సంగ్వాన్, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, వివిధ శాఖల అధికారులు పుష్పలత, కౌన్సిలర్లు, ఉద్యోగులు, స్వయం సహాయక బృందాల సభ్యులు ఉన్నారు.