జడ్చర్లటౌన్, నవంబర్18 : మిషన్ భగీరథ పథకంలో భాగంగా జడ్చర్ల మున్సిపాలిటీలోని ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇవ్వాలని అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఆదేశించారు. మున్సిపాలిటీలో మిషన్ భగీరథ పనులపై గురువారం సమీక్ష నిర్వహించారు. అలాగే హౌసింగ్బోర్డుకాలనీలో నూతనంగా నిర్మించిన వాటర్ట్యాంక్ను పరిశీలించారు. మున్సిపాలిటీలో మిషన్ భగీరథ పనులు ఏ మేరకు పూర్తయ్యాయి, మిగతా ప్రాంతాల్లో ఎన్ని రోజుల్లో పనులు పూర్తి చేస్తారన్న వివరాలను తెలుసుకున్నారు. డిసెంబర్ 31వ తేదీలోగా మిషన్ భగీరథ పనులను పూర్తిచేసి ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. నూతన సంవత్సరం నుంచి జడ్చర్ల ప్రజలకు ప్రతిరోజూ మిషన్ భగీరథ నీటిని అందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. మిషన్ భగీరథ నీటి సరఫరాకు ప్రణాళిక రూ పొందించాలని తెలిపారు. అదేవిధంగా పట్టణంలో వాటర్ట్యాంకుల పరిధిలోని వాల్స్ వద్ద మీటర్ల ఏర్పాటుపై సూచనలు చేశారు. అంతకుముందు జాతీయరహదారి ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద చౌరస్తాలో గార్డెనింగ్ ఏర్పాటును పరిశీలించారు. వివిధ రకాల మొక్కలతోపాటు వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ సునీతకు సూచించారు. అలాగే జడ్చర్ల-మహబూబ్నగర్ ప్రధానరహదారికి ఇరువైపులా మొక్కలు నాటాలని తెలిపారు. పట్టణం నుంచి పందులను ఇతర ప్రాంతాలకు తరలించడంతోపాటు ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు. అలాగే మండలంలోని కోడ్గల్ గ్రామంలో పల్లెప్రకృతి వనం, డబుల్బెడ్రూం ఇండ్లు, సీసీరోడ్ల నిర్మాణ పనులను అదనపు కలెక్టర్ పరిశీలించారు. గ్రామంలో పారిశుధ్య పనులను పరిశీలించి సర్పంచ్ను అభినందించారు. కార్యక్రమాల్లో మిషన్ భగీరథ ప్రాజెక్టు మేనేజర్ లక్ష్మారెడ్డి, పబ్లిక్హెల్త్ డీఈ మల్లేశ్, కోడ్గల్ సర్పంచ్ మమత, ఉపసర్పంచ్ రాంచంద్రయ్య, ఎంపీడీవో జగదీశ్, ఏపీవో విజయభాస్కర్, పంచాయతీ కార్యదర్శి రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.