మహబూబ్నగర్ మెట్టుగడ్డ, సెప్టెంబర్ 30: డబుల్ బెడ్రూం ఇండ్లు ఇప్పిస్తానని అమాయక ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్న ఘటన జిల్లాకేంద్రంలో చోటుచేసుకున్నది. శుక్రవారం మహబూబ్నగర్ రూరల్ ఎస్సై రాజేశ్వర్గౌడ్, సీఐ కేసు వివరాలను వెల్లడించారు. మహబూబ్నగర్ డీసీసీ అధ్యక్షుడి రేసులో ఉన్న అబ్దుల్ సిరాజ్ ఖాద్రి (ప్రస్తుతం జిల్లా ప్రధాన కార్యదర్శి) డబుల్ బెడ్రూం ఇండ్లు ఇపిస్తానని ఏడుగురి వద్ద డబ్బులు వసూలు చేయడంతో ఆయనతోపాటు ఖాదర్, వనగంటి ప్రకాశ్, మహ్మద్ ఇర్పాన్, కేశినేని ఆక్షయ్ను అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలోని భగీరథకాలనీలో నివాసముంటున్న ఆకుల కిరణ్కుమార్ ఎస్వీఎస్ దవాఖానలో పనిచేస్తున్నాడు. కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ సిరాజ్ఖాద్రీతో కొంతకాలంగా పరిచయం ఉండడంతో కిరణ్కుమార్కు దివిటిపల్లిలోని డబుల్ బెడ్రూం ఇల్లు ఇప్పిస్తానని రూ. 3.50లక్షలు తీసుకున్నాడు.
సిరాజ్ఖాద్రీ, జడ్చర్లకు చెందిన మరో వ్యక్తి ఖాదర్తో కలిసి బాధితుల నుంచి రూ.12.50లక్షలు తీసుకున్నట్లు విచారణలో తేలిందని తెలిపారు. బాధితుడు కిరణ్కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సిరాజ్ నుంచి రూ.2.50లక్షలు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. జిల్లాకేంద్రంలోని పుట్నాలబట్టికి చెందిన వనగంటి ప్రకాశ్ డబుల్ బెడ్రూం ఇల్లు ఇప్పిస్తానని లంగోటి ఆనంద్, గణేశ్ నుంచి రూ.2.50లక్షల చొప్పున తీసుకున్నాడు. ఇంకా ఇండ్లు ఇవ్వడంలేదని ప్రకాశ్ను నిలదీయగా ఇర్ఫాన్ అనే వ్యక్తికి ఇచ్చానని చెప్పి తప్పించుకు తిరుగుతున్నాడని, బాధితుల ఫిర్యాదు మేరకు ప్రకాశ్, బోయపల్లికి చెందిన మహ్మద్ ఇర్ఫాన్ను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు.
హనుమాన్పురకు చెందిన వ్యక్తికి దివిటిపల్లిలోని డబుల్ బెడ్రూం ఇల్లు వచ్చింది, ఆ ఇల్లు సమాధుల వద్ద ఉండడంతో ఇల్లు మార్పిస్తానని ఓ అధికారి కొడుకు కేశినేని అక్షయ్ రూ.30వేలు తీసుకున్నాడు. మరో వ్యక్తి ఇస్తాద్దీన్కు ఇల్లు ఇప్పిస్తానని రూ.70వేలు తీసుకున్నాడు. ఇల్లు ఇప్పించకుండా మోసం చేయడంతో బాధితులు రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని ఆధారాలు సేకరించి సిరాజ్ఖాద్రీతోపాటు ఖాదర్, వనగంటి ప్రకాశ్, మహ్మద్ ఇర్ఫాన్, కేశినేని ఆక్షయ్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందికి సీఐ రివార్డులు అందజేశారు.