శ్రీశైలం, సెప్టెంబర్ 30 : శ్రీశైలంలో శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భ్రమరాంబమల్లికార్జున స్వామి, అమ్మవార్లకు ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు చేసినట్లు ఈవో లవన్న తెలిపారు. ఐదో రోజైన శుక్రవారం భ్రమరాంబాదేవి స్కందమాతగా దర్శనమిచ్చారు. స్కందమాతగా సింహవాహనంపై ఆసీనురాలై చతుర్భుజాలు కలిగి పద్మం, కమలం, అభయహస్తం, ఒడిలో బాలషణ్ముఖుడైన కుమారస్వామి (స్కందుడు)ని ధరించారు. శేషవాహనంపై శ్రీశైల మల్లన్నతో కలిసి భక్తులను కరుణించింది. అక్కమహాదేవి అలంకార మండపంలో శేషవాహనం అధిష్టించిన భ్రమరాంబసహిత మల్లికార్జున స్వామి వారికి ప్రధాన అర్చకులు వేద పండితులు వాహనసేవను నిర్వహించారు.
అనంతరం కాళరాత్రిపూజ మంత్రపుష్పంతోపాటు అమ్మవారికి ఆస్థానసేవ జరిపించారు. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా గ్రామోత్సవం, ఆలయ ప్రాకారోత్సవం రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆలయ దక్షిణ మాడవీధిలో ఏర్పాటు చేసిన కళారాధనలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారుల నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. కాగా, శనివారం అమ్మవారు కాత్యాయని అలంకారంలో దర్శనమివ్వనుండగా.., మల్లికార్జున స్వామివారికి హంసవాహసేవ నిర్వహించనున్నారు.
జోగుళాంబ క్షేత్రంలో..
అలంపూర్, సెప్టెంబర్ 30 : శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం జోగుళాంబ అమ్మవారు స్కందమాతగా దర్శనమిచ్చారు. ఈవో పురేందర్కుమార్, ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, ధర్మకర్తలు యాగశాలలో హోమాలు, బలిహరణం, కుంకుమార్చనలు చేశారు. మధ్యాహ్నం అమ్మవారికి నివేదన సమర్పించారు. సాయంత్రం వరకు సహస్రనామార్చనలు నిర్వహిస్తూ.. భక్తులకు సర్వ దర్శన సదుపాయం కల్పించారు. 6 గంటల తర్వాత అమ్మవారికి దశవిద హారతులు సమర్పించారు. కాగా, శుక్రవారం ఆలయాలను ఏఎస్పీ రాములు నాయక్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ దర్శించుకున్నారు. చండీహోమానికి గానూ సీఎంవో కార్యాలయం నుంచి ఈవో, అర్చకులకు హోమద్రవ్యాలను అందజేశారు. కార్యక్రమంలో బాపురెడ్డి, రామచందర్, అర్చకుడు ఆనంద్శర్మ పాల్గొన్నారు.