గద్వాల, సెప్టెంబర్ 29: జిల్లాలో చిన్నారులు, గర్భిణులు, కిశోర బాలికలకు పోషకాహారం అందించి జిల్లాలో పోషకాహార లోపంలేని సమాజాన్ని తయారు చేయడానికి ప్రజాప్రతినిధులు, అంగన్వాడీ టీచర్లు, ఆశకార్యకర్తలు, ఏఎన్ంలు కృషి చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని కేఎస్ ఫంక్షన్హాల్లో మహిళా శిశు, దివ్యాంగ, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రక్తహీనత, పోషకాహార లోపంపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హాజరై జ్వోతిప్రజ్వళన చేసి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణులు, పిల్లల్లో పోషకాహార లోపం రాకుండా అందరూ కృషి చేయాలన్నారు. మల్దకల్ మండలంలో 500మంది, గట్టులో 400 మంది పోషకాహార లోపం పిల్లలు ఉన్నట్లు సర్వేలో తేలిందన్నారు.
వారికి మంచి ఆహారాన్ని అందించి పోషకాహార లోపం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. బాల్యవివాహాలను ఎవరు ప్రోత్సహించరాదన్నారు. బడీడు పిల్లలు బడిలో ఉండేలా అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. గర్భిణులు మంచి ఆహారం తీసుకొని పోషకాహార లోపాన్ని అధిగమించాలని సూచించారు. బతుకమ్మ కానుకగా పోషకాహార కిట్టు అందజేస్తే బాగుంటుందని కలెక్టర్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అదనపు కలెక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ బరువు తక్కువ ఉన్న పిల్లలను గుర్తించి వారికి బలవర్థకమైన ఆహారాన్ని అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గట్టు మండలానికి చెందిన ఇద్దరికి పౌష్టికాహారం అందించగా వారు బలవర్ధకంగా తయారయ్యారని చెప్పారు.
వారు కేంద్రమంత్రి చేతుల మీదుగా సన్మానం పొందారని తెలిపారు. బాలమృతం పిల్లలకు బహ్మాస్త్రం లాంటిదన్నారు. ఈ సందర్భంగా పౌష్టికాహార లోపంతో ఎదురయ్యే సమస్యలపై డాక్టర్లు కిశోర్కుమార్, సుధాకర్, నర్సింహారావు అవగాహన కల్పించారు. అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో బాలామృతం తయారు చేసి ప్రదర్శనలో ఉంచిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం బతుకమ్మ సంబురాల్లో పాల్గొని బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో జెడ్పీసీఈవో విజయానాయక్, డీఎంహెచ్వో చందూనాయక్, అధికారులు ముసాయిదాబేగం, జిల్లా గ్రంథాలయ చైర్మన్ జంబురామన్గౌడ్, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, అంగన్వాడీ సూపర్వైజర్లు, సర్పంచులు, సీడీపీవోలు తదితరులు పాల్గొన్నారు.