ప్రణాళికతో సాధన చేయించి.. లక్ష్యం దిశగా తీసుకెళ్లడంలో కోచింగ్ సెంటర్ల పాత్ర కీలకం. ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడంతోపాటు కొలువుల వేటలో ఉన్న పేద అభ్యర్థుల కోసం ఉచితంగా ఏర్పాటు చేసిన స్టడీ సెంటర్లకు ఆదరణ లభిస్తున్నది. ఇందులో భాగంగా మహబూబ్నగర్లో ఏర్పాటైన బీసీ స్టడీ సర్కిల్ అభ్యర్థుల బంగారు భవిష్యత్కు బాటలు వేసే దిశగా కోచింగ్ అందిస్తున్నది. గ్రూప్-3, 4 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న యువతను దరఖాస్తుల ఆధారంగా ఎంపిక చేసి ఉదయం బ్యాచ్లో 82 మందికి, మధ్యాహ్నం బ్యాచ్లో 62 మందికి కోచింగ్ ఇస్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన నిష్ణాతులైన ఫ్యాకల్టీ వివిధ సబ్జెక్టులను బోధిస్తున్నారు. ఉద్యోగ సాధనకు ఏం చేయాలో వివరిస్తున్నారు.
మహబూబ్నగర్, సెప్టెంబర్ 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఓ వైపు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడమేకాకుండా మరో వైపు పేద విద్యార్థులకు స్టడీ సర్కిల్స్ పెట్టి ప్రభుత్వమే ఉచితంగా కోచింగ్ కల్పిస్తున్నది. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న కోచింగ్ సెంటర్లకు మంచి ఆదరణ లభిస్తున్నది. గ్రూప్ 3,4 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించి ఎంపిక చేస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఉదయం, మధ్యాహ్నం బ్యాచ్లుగా విభజించి నిష్ణాతులైన ఫ్యాకల్టీతో బోధిస్తున్నారు. ప్రైవేట్లో వేలకు వేలు పెట్టి లభించని కోచింగ్ ప్రభుత్వ స్టడీ సర్కిళ్లల్లో లభిస్తుందని అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్టడీ సర్కిళ్లలో శిక్షణ పొందిన అభ్యర్థులు ఒక్క మహబూబ్నగర్ జిల్లాలోనే రెండేండ్లల్లో 162మంది ఉద్యోగాలు సంపాదించడం విశేషం.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో బీసీ స్టడీ సర్కిల్ను ఏర్పాటు చేశారు. ఉదయం 8గంటలకు, మధ్యాహ్నం ఒంటిగంట 30నిమిషాలకు ఇలా రెండు బ్యాచ్లకు కోచింగ్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఉదయం బ్యాచ్లో 82మంది అభ్యర్థులు, మధ్యాహ్నం బ్యాచ్లో 62మంది ప్రిపేర్ అవుతున్నారు. గ్రూప్3,4 ఉద్యోగార్థులకు హైదరాబాద్కు చెందిన ఫ్యాకల్టీతో వివిధ సబ్జెక్టులను అర్థమయ్యే రీతిలో బోధిస్తున్నారు. మ్యాథ్స్, అర్థమెటిక్, రీజనింగ్, ఎకనామిక్స్, చరిత్ర, తెలంగాణ చరిత్ర, ఉద్యమంపై అభ్యర్థులకు బోధిస్తున్నారు. పరీక్షల్లో ఎక్కువ మార్కులు ఎలా స్కోర్ చేయాలి, టైం మేనేజ్మెంట్ వంటి అంశాలపై ట్రిక్స్ చెబుతున్నారు. కాంపిటీషన్కు తగ్గట్టుగా ఎలా ప్రిపేర్ కావాలో సలహాలు కూడా ఇస్తున్నారు.
ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయడంతో ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు కళకళలాడేవి. వేలకు వేలు ఫీజులు దండుకునేందుకు రకరకాల ప్రకటనలు గుప్పించి నిరుద్యోగుల బలహీనతను సొమ్ము చేసుకునేవాళ్లు. ఫీజులు చెల్లించి చదువుకునే స్థోమత లేని విద్యార్థులు పుస్తకాలు కొని ఇంటివద్దే చదువుకునే పరిస్థితి. ముఖ్యమంత్రి కేసీఆర్ పేద అభ్యర్థులకు జిల్లాకో ఉచిత స్టడీ సెంటర్లు పెట్టాలని నిర్ణయించారు. దీంతో ఉచితంగా శిక్షణతోపాటు మెటీరియల్ కూడా ప్రభుత్వమే సమకూర్చడంతో నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రైవేట్ కోచింగ్ కన్న ఇక్కడ బాగుంది. ఫస్ట్ డే రీజనింగ్, సెకండ్ డే కావాల్సిన సబ్జెక్టులను క్షుణ్ణంగా వివరిస్తున్నారు. షార్ట్కట్లో ఎలా చదవాలో నేర్పిస్తున్నారు. ప్రైవేట్లో ఇలా ఉండదు. అర్థం కాకున్న అడగడానికి చాన్స్ ఉండదు. ప్రభుత్వమే మాలాంటి పేద అభ్యర్థుల కోసం కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉంది.
– రాజేశ్వరి, దేవరకద్ర
ప్రతిభఉన్నా ప్రైవేట్లో కోచింగ్ తీసుకోలేని వాళ్లకు ప్రభుత్వమే స్టడీ సర్కిల్ ద్వారా కోచింగ్ ఇప్పియడం చాలా సంతోషం. నిరుద్యోగులకు ఉద్యోగాల నోటిఫికేషన్లు వేయడమే కాకుండా ఉచితంగా స్టడీ సెంటర్లు పెట్టి అనుభవజ్ఞులైన అధ్యాపకులతో శిక్షణ ఇప్పిస్తున్నారు. అన్ని సబ్జెక్టులు చాలా బాగా చెప్తున్నారు. అన్ని వసతులు కల్పించి ఉద్యోగాలు కొట్టాలనే లక్ష్యానికి చేరువయ్యేలా చేస్తున్నారు.
– ఆనంద్, అజ్జకోలు గ్రామం
బయాలజీ కోచింగ్ ఇస్తున్నా. అభ్యర్థులు ఇక్కడ క్రమశిక్షణతో నేర్చుకుంటున్నారు. అర్థం కాని విషయాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఉద్యోగం కొట్టాలనే కసి ప్రతిఒక్కరిలో కనిపిస్తుంది. ప్రైవేట్లో కన్నా ఇక్కడ గెస్ట్గా వచ్చిన మాలాంటి శిక్షకులకు రెమ్యునరేషన్ను ఎక్కువ ఇస్తున్నారు. ఇంకా బాగా చదివించాలని మేము తాపత్రయపడుతున్నాం.
– మౌలాలీ, అధ్యాపకుడు, హైదరాబాద్