మహబూబ్నగర్, సెప్టెంబర్ 22 : బాలల సంరక్షణ చట్టాన్ని సవరించి దత్తత బాధ్యతను కలెక్టర్లకు అప్పగించినట్లు కేంద్ర మహిళాశిశు సంక్షేమశాఖ కార్యదర్శి ఇందివరపాండే తెలిపారు. గురువారం కలెక్టర్ వెంకట్రావుతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సవరించిన చట్టం ప్రకారం బాలల దత్తత ప్రక్రియను కలెక్టర్లు పూర్తిస్థాయిలో పరిశీలించాలని సూచించారు. కొవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన అనాథలను ఆదుకునే విషయంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. స్పాన్సర్షిప్ పథకం కింద అందిస్తున్న ఆర్థికసాయాన్ని రూ.2వేల నుంచి రూ.4వేలకు పెంచినట్లు పేర్కొన్నారు.
బాలల చట్టం, తల్లిదండ్రులను కోల్పోయిన అనాథలకు అందించే సహాయం స్పాన్సర్షిప్ వంటి పథకాలన్నింటినీ కలిపి మిషన్ వాత్సల్య పేరుపై కలెక్టర్లకు అధికారాలు ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నిబంధనల మేరకు దత్తత ప్రక్రియను ముందుకు తీసుకెళ్తామన్నారు. చట్టంలో సవరించిన మార్పులకు అనుగుణంగా బాలల చట్టాన్ని పకడ్బందీగా అ మలు చేస్తామన్నారు. అలాగే పెద్దఎత్తున అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. జిల్లాలో పారదర్శకంగా దత్తత ప్రక్రియను ముందుకు తీసుకుపోతున్నామని, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. వీసీలో అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మహిళా శిశుసంక్షేమ శాఖాధికారి జరీనాబేగం, డీఆర్డీవో యాదయ్య, డీఎస్పీ రమణారెడ్డి ఉన్నారు.