అమరచింత/అయిజ/శ్రీశైలం, సెప్టెంబర్ 16: జూరాల డ్యాంకు వరద పెరుగుతున్నది. శుక్రవారం సాయంత్రానికి 2.66లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదైంది. దీంతో ప్రాజె క్టు 43గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తికి 28,718క్యూసెక్కులు వినియోగిస్తున్నారు. మొత్తంగా 2,76,163క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదవుతున్నది. తుంగభద్ర డ్యాంకు ఇన్ఫ్లో 47,049, అవుట్ఫ్లో 46,620క్యూసెక్కులుగా నమోదైనట్లు టీబీ డ్యాం ఎస్ఈ శ్రీకాంత్రెడ్డి, సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు. అలాగే ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్ఫ్లో 50.824, అవుట్ఫ్లో 50,324 క్యూసెక్కులు నమోదైంది. శ్రీశైలం ప్రాజెక్టుకు శుక్రవారం సాయంత్రం వరకు 3,10,689 క్యూసెక్కుల ఇన్ఫ్లో చేరినట్లు అధికారులు తెలిపారు. 10గేట్లను 12అడుగుల ఎత్తులో తెరిచి 3,17,460క్యూసెక్కులు, కుడి, ఎడమ విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 50,877 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.