డెంగీపై కార్యాచరణ షురూ అయ్యింది. ప్రమాదకర వ్యాధిపై సర్కారు అప్రమత్తమైంది. కేసులు పెరగకముందే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. వ్యాధి అడ్డుకట్టకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. అధికారులతో ప్రత్యేక టీమ్ను ఏర్పాటు చేసింది. ఈ బృందం ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండి కేసులు పెరగకుండా చూసుకుంటుంది. జిల్లాలో ఇప్పటికే ఏదైనా గ్రామంలో కేసు నమోదైతే ఊరంతా సర్వే చేసి కేసులను గుర్తిస్తున్నది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పురపాలికల్లో జ్వర సర్వేకు శ్రీకారం చుట్టనున్నారు. ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు, దవాఖాన సిబ్బంది ఇంటింటికీ తిరిగి సర్వే చేయనున్నారు. మరోవైపు గ్రామాల్లో పారిశుధ్యం కోసం సంబంధిత విభాగాలన్నీ రంగంలోకి దిగాయి. అపరిశుభ్రంగా ఉంటే దోమల ద్వారా వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ఎక్కడికక్కడ శానిటైజేషన్ పనులు ముమ్మరం చేయనున్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
డెంగీ నివారణకు ప్రత్యేక టీమ్..
డెంగీ నివారణకు పురపాలకల్లో ఫీవర్ సర్వే నిర్వహించేందుకు పురపాలక, వైద్యారోగ్య శాఖలు సంయుక్తంగా ముందుకు సాగనున్నా యి. దీనికోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు ఇంటింటికెళ్లి జ్వరపీడితుల వివరాలను సేకరించనున్నాయి. కేసు నమోదైన వెంటనే సదరు గ్రామానికి చేరుకుంటారు. పాజిటివ్ వచ్చిన వారి ఇంటిని పూర్తిగా పరీక్షిస్తారు. కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఇంట్లో పైరిత్రం స్ప్రే చేస్తారు. చుట్టుపక్కల సుమారు 50ఇండ్లల్లో ఉంటున్న వారికి కూడా డెంగీ పరీక్షలు చేస్తారు. ఏమైనా అనుమానాలు ఉంటే సీరంను హైదరాబాద్కు పంపిస్తారు.
రెండు, మూడు రోజుల్లో ఫీవర్ సర్వే..
జిల్లాలో రానున్న రెండు, మూడు రోజుల్లో ఫీవర్ సర్వే ప్రారంభించనున్నారు. అన్ని గ్రామాల్లోని ప్రతి ఇంటికీ వెళ్లి జ్వర సర్వే చేపట్టనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆశ కార్యకర్తులు, ఏఎన్ఎంలు, పీహెచ్సీ సిబ్బందితో కలిసి ఫీవర్ సర్వే చేయనున్నారు. వారం పాటు సర్వే కొనసాగే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. సర్వేలో ఎలాంటి లక్షణాలు తేలినా వెంటనే వైద్యులు అలర్ట్ అవుతారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా డెంగీ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తారు. లక్షణాలు ఉన్నవారు నేరుగా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి పరీక్ష చేయించుకోవచ్చు. జ్వరం వచ్చిన మొదటి రోజు నుంచి ఐదో రోజు వరకు ఎన్ఎస్1 ఎలీసా, ఆరో రోజు ఐజీఎం ఏసీ ఎలీస్ పరీక్షలను ఉచితంగా చేస్తారు.
అన్ని శాఖల సమన్వయంతో ముందుకు..
డెంగీ నివారణలో వైద్య శాఖతోపాటు ఇతర శాఖలను కూడా సర్కారు భాగస్వామ్యం చేసింది. ఇప్పటికే ఆరోగ్య శాఖ మంత్రి పిలుపు మేరకు ఆదివారం ఆపరేషన్ క్లీన్ కార్యక్రమం కొనసాగుతున్నది. ప్రతి ఆదివారం ఉదయం 10గంటలకు ఇల్లు, పరిసరాలు శుభ్రం చేసుకునే కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లనున్నారు. ఇందులో విద్యార్థులు, టీచర్లు, ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయనున్నారు. వైద్య, ఆరోగ్య, మున్సిపల్, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో ముందుకెళ్లనున్నాయి. గ్రామాల్లో
పారిశుధ్య నిర్వహణపై చర్యలు తీసుకోనున్నారు. దోమలు లేకుండా ఫాగింగ్ చేయనున్నారు.
డెంగీ లక్షణాలు..
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
అప్రమత్తంగా ఉండాలి..
ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జ్వరం బాగా వచ్చినవారు వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. రెండు రోజులకు మించి జ్వరం ఉంటే ఆలస్యం చేయకుండా దవాఖానకు వెళ్లాలి. ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా డెంగీ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవచ్చు. చికిత్స సమయంలో రోగులు జాగ్రత్తగా ఉండాలి. ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. దోమలు లేకుండా చూసుకోవాలి.
– సుధార్లాల్, డీఎంహెచ్వో నాగర్కర్నూల్ జిల్లా