మహబూబ్నగర్, సెప్టెంబర్ 1 : ఎన్ని అడ్డంకులు వచ్చినా.. ఎంతటి కష్టం ఎదురైనా.. లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రతి ఒక్కరూ శ్రమించాల్సిందేనని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. గురువారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానం సమీపంలో రూ.1.70 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన బాలికల వసతి గృహాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ తల్లిదండ్రుల కలలను నిజం చేసేందుకు ప్రతి ఆడబిడ్డ బాగా చదవాలని పిలుపునిచ్చారు. కుటుంబంలో ఆడబిడ్డ బాగుపడితే ఆ కుటుంబం అంతా సంతోషంగా ఉంటుందన్నారు. గడిచిన 70 ఏండ్ల కాలంలో ఎన్నడూ లేనంతంగా ప్రభుత్వం ఆడబిడ్డలు చదుకునేందుకు తోడ్పాటును అందిస్తుందని చెప్పారు. నాటి ప్రభుత్వాలు తండాలను పట్టించుకోలేదని, తాగేందుకు మంచినీరు లేక అష్టకష్టాలు పడ్డారని గుర్తు చేశారు.
తెలంగాణ వచ్చాక ఆ పరిస్థితి లేదన్నారు. ప్రతి తండా అభివృద్ధి పథకంలో దూసుకెళ్తుందన్నారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు కల్యాణలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చామన్నారు. వేలాది గురుకులాలను ఏర్పాటు చేసి అందరికీ విద్యను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. రూ.1.10 కోట్లతో నూతన గిరిజన భవన్ను, సమీపంలోనే సంత్ సేవాలాల్ మహరాజ్ ఆలయాన్ని నిర్మించుకుందామన్నారు. ఎదిరలో రూ.1.20 కోట్లతో రెసిడెన్షియల్ పాఠశాలను, రూ.2.70 కోట్లతో వర్కింగ్ ఉమెన్స్ వసతి గృహాన్ని నిర్మించినట్లు తెలిపారు. విద్యార్థినులకు అన్నలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. గిరిజన వసతి గృహాన్ని దత్తత తీసుకుంటానన్నారు. ఒక మెస్ కమిటీని ఏర్పాటు చేయాలని, ప్రతి నెలా మహిళా డాక్టర్చే విద్యార్థినులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. రూ.15 కోట్లతో స్టేడియాన్ని నిర్మించనున్నట్లు చెప్పారు. విద్యార్థినులు క్రీడల్లో శిక్షణ పొందాలని, నిత్యం వ్యాయామం, యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉండాలన్నారు. అనంతరం మంత్రి శ్రీనివాస్గౌడ్తో విద్యార్థులు సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడ్డారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావు, అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ రహెమాన్, మున్సిపల్ వైస్ చైర్మన్ తాటి గణేశ్, కౌన్సిలర్లు రామ్లక్ష్మణ్, కిశోర్, శ్రీనివాస్రెడ్డి, ప్రశంత్, మోతీలాల్, లక్ష్మణ్నాయక్, గిరిజన సంక్షేమాధికారి జిల్లా ఛత్రూనాయక్, గిరిజన సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు రాజు నాయక్, గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు దేవుజా నాయక్, టీఎన్జీవోఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రానాయక్ పాల్గొన్నారు.
మన్యంకొండ వద్ద బడ్జెట్ హోటల్
మన్యంకొండ దిగువ భాగంలో.. జాతీయ రహదారికి చేరువలో పర్యాటకుల సౌకార్యర్థం బడ్జెట్ హోటల్ నిర్మిస్తున్నట్లు ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. హోటల్ నిర్మాణానికి రూ.15 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. బుధవారం మన్యంకొండ స్టేజీ సమీపంలోని అలివేలు మంగతాయారు ఆలయానికి సమీపంలో హోటల్ కోసం ప్రతిపాదించిన స్థలాన్ని అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ హోటల్ నిర్మాణం తర్వాత దూరప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు, భక్తులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ యాదాద్రి, వేములవాడ ఆలయాలతోపాటు మన్యంకొండ అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. సమైక్య రాష్ట్రంలో క్షేత్రంలోని పుష్కరిణి ఎండిపోవడంతోపాటు స్వామి అభిషేకానికి కష్టంగా ఉండేదన్నారు. స్వరాష్ట్రం సిద్ధించాక కృష్ణా జలాలను కొండపైకి తీసుకెళ్లి వెంకన్న స్వామిని అభిషేకించినట్లు తెలిపారు. కొండపై భక్తుల కోసం 18 గదుల పనులు చివరి దశకు చేరాయన్నారు. అలాగే అలివేలు మంగ ఆలయం వద్ద ఏసీ ఫంక్షన్హాల్ నిర్మిస్తున్నామని తెలిపారు. ఆలయం ముడా పరిధిలో ఉండడంతో భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు.
రాష్ట్రంలోనే తొలి గణేశ్ భవన్
రాష్ట్రంలోనే తొలి గణేశ్ భవన్ను మహబూబ్నగర్లో ప్రారంభించడం సంతోషంగా ఉన్నదని మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయ సమీపంలో రూ.30 లక్షలతో నిర్మించిన గణేశ్ భవన్ను మంత్రి ప్రారంభించారు. భవన్లో ప్రతిష్ఠించిన గణపయ్యకు పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ చవితి నాటికి గణేశ్ భవన్ నిర్మించాలని కార్యాచరణ సిద్ధం చేసి కేవలం 20 రోజుల్లోనే పూర్తి చేయడం గొప్ప విషయమన్నారు. పుర్తిస్థాయి పనులు చేపట్టేందుకు అవసరమైన నిధులు అందజేస్తానన్నారు. ఈ భవనం వేగంగా నిర్మించేందుకు కృషి చేసిన అధికారులు, ఇంజినీర్లు, మేస్త్రీలను మంత్రి అభినందించారు. అలాగే చిన్నదర్పల్లిలో గోశాలకు అవసరమైన అటవీ శాఖ క్లియరెన్స్ పూర్తి చేశామన్నారు. ఫత్తేపూర్ మైసమ్మ ఆలయం కోసం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి 15 ఎకరాల స్థలాన్ని తీసుకొని వారికి ప్రత్యామ్నయం చూపిస్తున్నామని చెప్పారు. పద్మావతి కాలనీలో ఆంజనేయస్వామి ఆలయానికి పార్కులతో సహా రెండెకరాల స్థలాన్ని అప్పగించామన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, మన్యంకొండ ఆలయ ధర్మకర్త అళహరి మధుసూదన్, గణేశ్ ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి బుచ్చారెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు గోపాల్ యాదవ్, గొర్రెల పెంపకందారుల సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు శాంతయ్య యాదవ్, తాసిల్దార్ పాండు, ఆర్ఐలు క్రాంతి, నర్సింగ్, డైరెక్టర్ మల్లు నరసింహారెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు దేవేందర్రెడ్డి పాల్గొన్నారు.