మహబూబ్నగర్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రంలోని రైతు సంక్షేమం కోసం ఆలోచించేది సీఎం కేసీఆర్ ఒక్కరే అని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. గురువారం మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం కర్వెన గ్రామంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 300 మంది నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి రాష్ర్టాన్ని పాలించిన గత ముఖ్యమంత్రులు జేబులు నింపుకొన్నారే తప్పా ప్రజల బాగోగులు పట్టించుకోలేదని విమర్శించారు.
పేదల సంక్షేమం కోసం రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలను తీసేయాలని ప్రధాని మోదీ చెబుతున్నారని ధ్వజమెత్తారు. 2014 కంటే ముందు పల్లెలు ఎట్లా ఉండే ఆ తర్వాత ఎట్ల మారాయే గమనించాలన్నారు. తెలంగాణ రాక ముందు 14ముఖ్యమంత్రులు వచ్చి పోయారని, ఏనాడైనా ప్రజల గూర్చి ఆలోచించారా? అని ప్రశ్నించారు. మహిళలు, సన్న, చిన్నకారు రైతులు, చేనేత కార్మికులు, ఇతర వర్గాల గురించి ఆలోచించిన సీఎం ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ ఒక్కరేనని అన్నారు. కేంద్రం రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఆయా పార్టీలకు రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరడం అభినందనీయమన్నారు.
భూత్పూర్ మండలం కర్వెన గ్రామంలోని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డిని గ్రామస్తులు మేళ తాళాలతో ఊరేగించారు. అనంతరం దేవాలయం సమీపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ భూత్పూర్ మండలాధ్యక్షుడు చింతలపల్లి బాల్రెడ్డి, యువజన కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఏర్వ శ్రీకాంత్రెడ్డి, ఆపార్టీలకు చెందిన కావలి శ్రీను, మన్యపురెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్గౌడ్, ఎంపీపీ కదిరే శేఖర్రెడ్డి, అశోక్రెడ్డి, సర్పంచ్ బాలేమియా, మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ, ముడా డైరెక్టర్ సాయి, మురళీగౌడ్ పాల్గొన్నారు.