మహబూబ్నగర్, ఆగస్టు 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంం జోలికి వస్తే ఖబడ్దార్.. తమ అధినేత కుటుంబంపై ఈడీ, సీబీఐ కేసులు పెడ్తామని చేస్తున్న బెదిరింపులకు భయపడమని ఆబ్కారీ, క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. గురువారం హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలానికి చెందిన కాంగ్రెస్, బీజేపీకి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరారు.
దాదాపు 300మంది నాయకులు మంత్రి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలోని ప్రతి కుటుంబం కేసీఆర్కు అండదండగా ఉంటుందన్నారు. ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ కార్యకర్తలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే టీఆర్ఎస్ పార్టీ తగిన గుణపాఠం చెబుతుందని హెచ్చరించారు. కేసీఆర్ కుటుంబంపై కేసులు పెడ్తామని చేస్తున్న బెదిరింపులకు, దౌర్జన్యాలకు, దాడులకు కూడ బెదరబోమన్నారు.
భవిష్యత్లో ఇలాంటివి తిరిగి పునరావృతం అయితే బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను సీఎం కేసీఆర్ నిరంతరం ప్రశ్నిస్తారన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందని విమర్శించారు. టీఆర్ఎస్లో నాయకులకు, కార్యకర్తలకు మంచి భవిష్యత్ ఉంటుందని ప్రతి కార్యకర్తనూ గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటామన్నారు. కులాలు, మతాల పిచ్చితో బీజేపీ,కాంగ్రెస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.
బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలు, రాష్ట్రంలో మతకల్లోలాలు సృష్టిస్తున్న పార్టీలో మేము ఉండబోమని నాయకులు తేల్చి చెప్పారు. సీఎం కేసీఆర్ తెలంగాణ అభివృద్ధ్దికి పెద్దపీట వేస్తున్నపార్టీలో ఉంటామని హన్వాడ మండలానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్కు తరలివెళ్లి మంత్రి సమక్షంలో పార్టీలో చేరారు. వీరంత ఆయా పార్టీలకు రాజీనామాలు చేసి టీఆర్ఎస్లో చేరడంతో వారందరినీ మంత్రి సాదరంగా ఆహ్వానించారు.