నాగర్కర్నూల్ టౌన్, ఆగస్టు 19 : గ్రామీణ ప్రాంతాల్లో దీర్ఘకాలిక వ్యాధితో మంచానికే పరిమితమైన రోగులను గుర్తించి ఆలన కేంద్రం అక్కున చేర్చుకుంటున్నది. వారికి ఉచితంగా ఆహారం, మందులు, వైద్య సేవలందిస్తూ తోడుగా నిలిచి మనోధైర్యం కల్పిస్తున్నది. నాగర్కర్నూల్ జిల్లా దవాఖానలో తెలంగాణ పాలియేటివ్ కేర్ ఆలన కేంద్రాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు 2022 జనవరిలో ప్రారంభించారు. ఆనాటి నుంచి ఇప్పటివరకు 200 మంది వ్యాధిగ్రస్తులకు సేవలందించారు. క్యాన్సర్, పక్షవాతం, డయాబెటిస్, రోడ్డు ప్రమాదాల్లో గాయాలపాలై మంచం పట్టిన వారిని ఆలన కేంద్రానికి తీసుకొచ్చి ఉచితంగా వైద్యమందిస్తున్నారు. చికిత్స కేంద్రం వరకు రాలేని వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆలన వాహనంలో వెళ్లి ఇంటి వద్దే వైద్య సేవలందిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న రోగులకు, నిరుపేదలకు ఆలన వైద్యం ఉపశమనం కలిగించడంతోపాటు క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. దీంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నాగర్కర్నూల్ జిల్లాలోని 20 మండలాల్లోని 26 పీహెచ్సీల పరిధిలో పనిచేస్తున్న వైద్యులు, ఆశవర్కర్లు, అంగన్వాడీల సహకారంతో ఆలన వైద్య బృందం మంచానికి పరిమితమైన రోగుల వివరాలు సేకరించి రికార్డు నమోదు చేసే పనిలో నిమగ్నమయ్యారు. 72 మంది క్యాన్సర్ వ్యాధితో, 150 మంది ఇతర వ్యాధులతో మంచానికి పరిమితమైనట్లు పాలియేటివ్ కేర్ గుర్తించింది. వారందరికీ విడుతల వారీగా జిల్లా దవాఖానలోని ఆలన కేంద్రానికి తరలించి వైద్య సేవలందిస్తున్నారు.
అందుబాటులో వైద్య సేవలు..
దీర్ఘకాలిక వ్యాధులకు వైద్యం చేయించుకోలేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న రోగులకు కావాల్సిన మందులు, రోగులను ఆలన కేంద్రానికి తీసుకొచ్చే వాహనం అందుబాటులో ఉన్నాయి. రోగులకు కావాల్సిన సమాచారం అందించేందుకు 8341798124, 9177476074, 8374366675 నెంబర్లను కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) కింద రాష్ట్ర వ్యాప్తంగా 2017లో పది పాలియేటివ్ కేర్ ఆలన కేంద్రాలను ప్రారంభించారు. నాగర్కర్నూల్లోని ఆలన కేంద్రంలో ఆరుగురు వైద్య సేవలందిస్తున్నారు. ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి, డాక్టర్, ఇద్దరు స్టాఫ్నర్సులు, ఒక ఆయా, వాహన డ్రైవర్ విధులు నిర్విర్తిస్తున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి..
నాగర్కర్నూల్ జిల్లాలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు జిల్లా దవాఖానలోని ఆలన కేంద్రంలో చికిత్స అందించి ఉపశమనం కల్పిస్తున్నాం. ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులు, డైట్ అందిస్తున్నాం. చికిత్స కోసం వచ్చిన క్యాన్సర్ రోగులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నాం. ఈ అవకాశాన్ని చివరి దశలో క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్న వారు సద్వినియోగం చేసుకోవాలి.
– డాక్టర్ శ్రీవాణి, పాలియేటివ్ కేర్ ఆలన మెడికల్ అధికారి, నాగర్కర్నూల్
వైద్యం బాగుంది..
రెండేండ్ల కిందట మెడపై గడ్డ ఏర్పడి క్యాన్సర్ వచ్చింది. హైదరాబాద్ బసవతారకం దవాఖానలో ఆపరేషన్ చేయించుకున్నాను. రేడియేషన్ చేయించుకోవాలంటే భయం వేసింది. అంతేకాకుండా చాలా ఖర్చు అవుతుందన్నారు. మాకు అంత స్థోమత లేదు. ఆలన కేంద్రం డాక్టర్ మా ఇంటికి వచ్చి హైదరాబాద్లోని ప్రభుత్వ క్యాన్సర్ దవాఖానలో ఉచితంగా రేడియేషన్ నిర్వహిస్తామని ధైర్యాన్ని కల్పించారు. ప్రస్తుతం నాగర్కర్నూల్ జిల్లా దవాఖానలోని ఆలన కేంద్రంలో వైద్యం అందిస్తున్నారు. ఇక్కడ వైద్యం చాలా బాగుంది. ఇప్పుడు కాస్త ఆరోగ్యంగా ఉన్నాను. వైద్యులు ఇచ్చిన భరోసా మరువలేను.
– కుర్మయ్య, గుడిపల్లి