మహబూబ్నగర్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఫ్రీడమ్ ర్యాలీ సందర్భంగా క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ డమ్మీ తుపాకీతో రబ్బర్ బుల్లెట్ పేల్చి ర్యాలీని ప్రారంభించిన అంశంపై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు విరుచుకుపడుతున్నారు. స్వయంగా మంత్రి, అధికారులు వివరణ ఇచ్చినా కావాలని కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలపై మహబూబ్నగర్, జడ్చర్ల నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. బీసీ నాయకుడిగా కష్టపడి ఈస్థాయికి ఎదిగిన మంత్రిపై అభివృద్ధిని చూసి ఓర్వలేక జడ్చర్లకు పారిపోయి అక్కడ విమర్శలకు దిగుతున్నారని దుయ్యబట్టారు. ఎర్రశేఖర్కు రాజకీయాల్లో ఉండే అర్హత లేదని దమ్ముంటే గతంలో నలుగురు ముదిరాజ్ హత్యలకు కారకులెవరో బహిరంగ పర్చాలన్నారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ను విమర్శిస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరికలు జారీ చేశారు. నిరంతరం రాత్రింబవళ్లు ప్రజల కోసం పరితపించే తమ నాయకుడిని విమర్శిస్తే సహించేది లేదన్నారు. ఓటుకు నోటు కేసులో డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిపోయి అధ్యక్ష పదవి వెలగబెట్టే పార్టీలో చేరి..రోజుకో పార్టీ మారుతున్న ఎర్రశేఖర్ స్థాయిని మరిచి మాట్లాడుతున్నాడని విరుచుకుపడ్డారు.
‘సొంత తమ్ముడినే తుపాకీతో పట్టపగలు కాల్చిచంపి జైలుకుపోయిన నువ్వు మంత్రిని విమర్శించే స్థాయికి ఎదిగావా..’? అంటూ నిలదీశారు. ‘తుపాకీ సంస్క్రృతిని జిల్లాలో తీసుకొచ్చిన నీవు తుపాకుల గూర్చి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లే’ ఉందని అన్నారు. 2013 జూలైలో సొంత తమ్ముడినే కాల్చి చంపిన కేసులో ఎర్రశేఖర్ను పోలీసులు జైలుకు పంపే ఫొటోలను టీఆర్ఎస్ నేతలు విడుదల చేశారు. దీంతో మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ నేతల నోట్లో పచ్చివెలక్కాయ పడ్డట్లయింది.
హత్య రాజకీయాలకు కేరాఫ్ ఎర్రశేఖర్ముడా చైర్మన్, గంజి వెంకన్న
భార్యకు రాజకీయ పదవి కోసం సొంత తమ్ముడినే కాల్చి చంపిన ఎర్రశేఖర్ హత్య రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయాడని మహబూబ్నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గంజివెంకన్న ఆరోపించారు. సోమవారం ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ పాలమూరు జిల్లా అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న నిజాయితీ పరుడైన మంత్రి శ్రీనివాస్గౌడ్ను విమర్శిస్తే చూసు ఊరుకోబోమని హెచ్చరించారు. నియెజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్న మంత్రిపై అవాక్కులు చవాక్కులు పేలడం సూర్యడిమీద ఉమ్మేసినట్లుగా ఉందన్నారు. సొంత తమ్ముడినే చంపితే ఆ కుటుంబం మొత్తం అష్టకష్టాల పాలైందని ఇది కాంగ్రెస్ నాయకులకు తెల్వదా అని ప్రశ్నించారు. గన్లైసెన్స్ పెట్టకుని సొంతతమ్ముడైన సుధాకర్ ముదిరాజ్ను పట్టపగలే అందరిముందే హత్య చేశాడన్నారు.
పదేండ్ల కిందటి సంగతి మర్చిపోయారా?మున్సిపల్ చైర్మన్ నర్సింహులు
జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ సొంత తమ్ముడిని పట్టపగలు కాల్చి చంపి బిహార్ సంస్కృతికి పదేండ్ల కిందనే బీజం వేశారని మున్సిపల్ చైర్మన్ కొరమోని నర్సింహులు ఆరోపించారు. హత్య చేసిన ఒక వ్యక్తి..అభివృద్ధి చేస్తున్న మంత్రిపై విమర్శలు చేయడం సరికాదని హెచ్చరించారు. ర్యాలీని లాంఛనంగా ప్రారంభించేందుకు గన్ను ఫైర్ చేసిన మంత్రి ఎక్కడా.. సొంత తమ్ముడిని చంపిన నువ్వెక్కడ.. అని దుయ్యబట్టారు. కేవలం సర్పంచ్ పదవికోసం సొంత తమ్ముడిని చంపి హత్యా రాజకీయ సంస్కృతి నీదన్నారు. దమ్ముంటే హత్యకు గురైన నీ తమ్ముడి భార్యను గడియారం చౌరస్తావద్దకు తీసుకొచ్చి మా బావా చంపలేదని నిరూపించమని సవాల్ విసిరారు.
ఎలక్షన్ వస్తేనే తెరమీదకు..మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మురళీ
నేతలంటే జనంలో ఉండాలి..ప్రజల్లో తిరగాలి..ఎలక్షన్ అయ్యాక ఓడిపోయి అడ్రస్ లేని నేతలు ఇవాళ మంత్రిని విమర్శించే స్థాయికి ఎదిగారని జడ్చర్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మురళి ముదిరాజ్ విరుచుకుపడ్డారు. ఎలక్షన్ల ముందు మాత్రమే ఎర్రశేఖర్ తెరమీదకు వస్తాడని ఇలాంటి వాళ్లను జనం నమ్మరని దుయ్యబట్టారు. మంత్రిపై ఎర్రశేఖర్ విమర్శలు చేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు. తుపాకీతో హత్య చేసిన ఎర్రశేఖర్ తుపాకుల గూర్చి మాట్లాడటం విడ్డురమన్నారు. గన్ఫైర్పై మంత్రి, ఎస్పీ వివరణ ఇచ్చాక రాజకీయం చేయడం తగదన్నారు.
గత హత్యలకు కారకులెవరోమున్సిపల్ వైస్ చైర్మన్ గణేశ్ ముదిరాజ్
పాలమూరులో హత్య సంస్కృతికి తెరలేపిన ఎర్రశేఖర్ గతంలో జరిగిన హత్యలకు కారుకులేవరో దమ్ముంటే బయట పెట్టాలని మున్సిపల్ వైస్ చైర్మన్ గణేశ్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో గతంలో హత్యలకు గురైన యాదయ్య ముదిరాజ్, వెంకటయ్య ముదిరాజ్, రాజు ముదిరాజ్, కట్టెనికి రాములును ఎందుకు ఎవరు హతమార్చారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. హత్యల సంస్కృతికి నిలయమైన నీవు మంత్రిని విమర్శిస్తావా? అంటూ నిలదీశారు. తన సొంత చెల్లులు శ్రీదేవి తన సోదరుడు సుధాకర్ ముదిరాజ్ను ఎర్రశేఖరే కాల్చి చంపాడని మీడియా ముందుకు చెప్పిన విషయాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు.