నారాయణపేట, ఆగస్టు 15: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు దేశ విదేశాల్లో ప్రశంసలు అందుతున్నాయని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్, ఎమ్మెల్యేలు రాజేందర్రెడ్డి, రామ్మోహన్రెడ్డి, కలెక్టర్ హరిచందన ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం హరిత, స్వర్ణ, జలసిరుల తెలంగాణ వైపుగా కదులుతుందన్నారు. పేట జిల్లాలో పింఛన్ల కోసం ప్రతి నెలా రూ.16.32 కోట్లు మం జూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరానికిగానూ బ్యాంకు లింకేజీ ద్వారా రూ.38.99 కోట్ల రుణాలు ఇచ్చామన్నారు.
రైతు బంధు పథకం ద్వారా జిల్లాలో 1,73,237 మంది రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. కల్యాణలక్ష్మి పథకం ద్వారా 4,838 మంది లబ్ధిదారులకు రూ.48.36 కోట్లు, షాదీముబారక్ పథకం ద్వారా 310 మంది లబ్ధిదారులకు రూ.3.09 కోట్లు అందించినట్లు వివరించారు. రూ. కోటి వ్యయంతో పట్టణంలోని వృద్ధ్దాశ్రమాన్ని నిర్మించి ఆశ్రయం కల్పించామన్నారు. చేనేత బీమా పథకం ద్వారా 900 మంది చేనేత కార్మికులకు లబ్ధి చేకూరనున్నదన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో 13,476 మందికి కొత్తగా ఆసరా పింఛన్లకు అర్హత సంపాదించగా, ఇందులో 10 మంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్ ఐడీ కార్డులు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అనసూయ, అదనపు కలెక్టర్ పద్మజారాణి, అదనపు ఎస్పీ భరత్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.