మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఆగస్టు 14 : టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల పక్షాన నిలబడిన పార్టీ, ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. ఆదివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో 37వ వార్డుకు చెందిన సుమారు 200 మందికిపైగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. మతం పేరుతో ప్రజల మధ్యన చిచ్చుపెట్టి రెచ్చగొట్టి రాజకీయం చేయడానికి కాంగ్రెస్, బీజేపీలు చూస్తున్నాయని దుయ్యబట్టారు. ప్రజలకు అబద్ధపు మాటలు చెప్పి అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వారి కండ్లు మండుతున్నాయని ధ్వజమెత్తారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ర్యాలీని ప్రారంభించేందుకు డమ్మీ తుపాకీతో.. రబ్బర్ బుల్లెట్తో చేసిన ఫైరింగ్పై అనవసర వివాదంగా కొందరు ప్రతిపక్ష నేతలు మారుస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. పాలమూరు జిల్లాకు కేటాయించిన రోడ్లు, బైపాస్ను తరలించుకుపోయిన నేతలు నేడు అధికారంలోకి వచ్చేందుకు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. ఎవరికి ఆపద వచ్చినా ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్నారు. అనంతరం పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీపై ప్రజలు విశ్వాసం కోల్పోయారని, అభివృద్ధిని చూసే టీఆర్ఎస్లో చేరామన్నారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ గంజి వెంకన్న, కౌన్సిలర్ కిశోర్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు శివరాజు, కార్యదర్శి మెల్గర వినోద్, సతీశ్, సుదర్శన్గౌడ్, సత్యం యాదవ్, అజయ్, రాములు పాల్గొన్నారు.
క్రీడాభివృద్ధికి కృషి
మహబూబ్నగర్ టౌన్, ఆగస్టు 14 : క్రీడాభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తున్నామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో రూ.23.29 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రధాన స్టేడియంలో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, హ్యాండ్బాల్, హై జంప్, లాంగ్జంప్ కోర్టులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అత్యుత్తమ ప్రమాణాల వల్లే కామన్వెల్త్ క్రీడల్లో దేశంలోనే తెలంగాణ అత్యధిక పతకాలు సాధించి రెండో స్థానంలో నిలిచిందన్నారు. అత్యుత్తమ క్రీడా ప్రమాణాలు కలిగిన స్టేడియం నిర్మాణం త్వరలో సాకారం కాబోతున్నట్లు తెలిపారు.
జాతీయస్థాయి క్రీడలు నిర్వహించేలా స్టేడియాన్ని తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో రూ.17.32 కోట్లతో పెద్ద ఎత్తున క్రీడా సౌకర్యాలు మెరుగు పర్చుతున్నట్లు తెలిపారు. అంతకు ముందు క్రీడా మైదానాన్ని పరిశీలించి, క్రీడాకారులను మంత్రి ఉత్సాహపరిచారు. పక్కనే ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వ గిరిజన బాలికల వసతి గృహాన్ని పరిశీలించారు. త్వరలో ప్రారంభోత్సవం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, సీతారామారావు, ముడా చైర్మన్ వెంకన్న, డీవైఎస్వో శ్రీనివాస్, కౌన్సిలర్ రామ్ తదితరులు పాల్గొన్నారు.
కళలను కాపాడుకుందాం
పాలమూరు, ఆగస్టు 14 : అంతరించిపోయిన కళలను కాపాడుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకున్నదని మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. అందులో భాగంగానే కళలు, కళాకారులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం మహబూబ్నగర్ జెడ్పీ మైదానంలో స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని జానపద కళాకారులతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణలో మన నేత కార్మికులు తయారు చేసిన జాతీయ జెండాలను ప్రతి ఇంటికీ అందించడం గర్వంగా ఉందన్నారు. మన రాష్ట్రంతోపాటు 22 రాష్ర్టాలకు కూడా అందించడం సంతోషమన్నారు. అనంతరం సాంస్కృతిక ప్రదర్శనలు చేసిన కళాకారులను మంత్రి ప్రశంసాపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్రెడ్డి, అడిషనల్ కలెక్టర్లు సీతారామారావు, తేజస్ నందలాల్ పవార్, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, సాంస్కృతిక శాఖాధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.