ఖిల్లాఘణపురం, ఆగస్టు 14 : 150 ఏండ్ల సుదీర్ఘ పోరాటంతోనే స్వాతంత్య్రం సిద్ధించిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం ఖిల్లాఘణపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలకు మంత్రి హాజరయ్యారు. విద్యార్థులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. విద్యార్థుల సాంస్కృతిక, ఆర్మీ పరేడ్, వేషధారణలతో ఇచ్చిన ప్రదర్శనలను తిలకించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అన్ని కులాలు, మతాలు, వర్గాలకతీతంగా కలిసికట్టుగా పోరాటం చేసి స్వాతంత్య్రాన్ని సాధించినట్లు తెలిపారు. స్వతంత్ర భారతంలో జీవించే హక్కు లేకుంటే నిజమైన స్వాతంత్య్రం లేనట్టేనన్నారు.
దేశంలో జీవించే ప్రతి పౌరుడికి సమాన అవకాశాలు, పాలనకోసం రాజ్యాంగాన్ని అంబేద్కర్ రచించారని తెలిపారు. అందుకే పౌరులు స్వేచ్ఛగా బతుకుతున్నారని చెప్పారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. స్వాతంత్య్ర పోరాటయోధుల చరిత్ర తెలుసుకొని ఉన్నతంగా జీవించాలన్నారు. ఆర్మీ వేషధారణతో ఉన్న విద్యార్థులతో మంత్రి ముచ్చటించి మిఠాయిలు తినిపించారు. వేడుకలకు రూ.50 వేల ఆర్థిక సాయం చేసిన వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు గాండ్ల రామును అభినందించారు. కార్యక్రమంలో ఎంపీపీ కృష్ణానాయక్, జెడ్పీటీసీ సామ్యనాయక్ పాల్గొన్నారు.
విజయ ఉత్పత్తులను ఆదరించాలి
వనపర్తి, ఆగస్టు 14 : విజయ ఉత్పత్తులను ప్రజలు ఆదరించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రూ.35 లక్షలతో తెలంగాణ ఆయిల్ఫెడ్ ఆధ్వర్యంలో నిర్వహించే అధునాతన విజయ వంట నూనెల విక్రయ కేంద్రం, స్టాక్ పాయింట్ నిర్మాణానికి ఆయిల్ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, ఎండీ సురేందర్, నాయకులతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ అందరికీ అందుబాటులో నాణ్యమైన వంట నూనెలు ఉంటాయని చెప్పారు. వంట నూనెలలో విజయ ఉత్పత్తులు మేలని అన్నారు. ప్రభుత్వ పరంగా విజయ వంటనూనెలకు ప్రోత్సాహం ఉంటుందని పేర్కొన్నారు.
తెలంగాణ ఆయిల్ఫెడ్ ఆధ్వర్యంలో విజయవంతంగా ఉత్పత్తులు తయారవుతాయని తెలిపారు. మిషన్ భగీరథతో శుద్ధమైన తాగునీరు సరఫరా అవుతుందని పేర్కొన్నారు. పల్లె, పట్టణ ప్రగతితో రూపురేఖలే మారిపోయాయని, ఫలితంగా క్షేత్ర స్థాయిలో విష, డెంగీ జ్వరాలు తగ్గాయన్నారు. ప్రజల ఆరోగ్య విషయంలో ఆహారరంగం ఎంతో కీలకమని చెప్పారు. అందుకే రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, కమిషనర్ విక్రమసింహారెడ్డి, గొర్రెల కాపరుల సంఘం జిల్లా అధ్యక్షుడు కురుమూర్తి యాదవ్, కౌన్సిలర్లు చీర్ల సత్యం, భువనేశ్వరి, మేనేజర్లు సత్యనారాయణ, సుధాకర్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.