మంత్రాలయం, ఆగస్టు 14 : కర్నూల్ జిల్లాలోని తుంగభద్ర నదీ తీరాన వెలసిన మంత్రాలయంలోని రాఘవేంద్రస్వామి 351 సప్త రాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రాఘవేంద్రస్వామి (ఉత్తరారాధన) రథోత్సవం కనులపండువగా జరిగింది. ఆదివారం ఉదయం స్వామి మూల బృందావనానికి పవిత్ర నదీ జలాలతో అభిషేకించిన పట్టువస్ర్తాలు, పుష్పాలతో అలంకరించారు. ప్రహ్లాద రాయలు, మూల రాములను అలంరించి పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు పూజలు చేశారు. అనంతరం మహా రథోత్సవంపై ఆశీనులైన ప్రహ్లాద రాయలు భక్తకోటి జనులను ఆశీర్వదించారు.
వేద పండితుల మంత్రోచ్ఛరణలు, మేళ తాళాలు, భక్త జనుల జయజయ ధ్వానాలు, కళాకారుల నృత్య ప్రదర్శనల మధ్య రథోత్సవం రమణీయంగా సాగింది. అనంతరం మూల రాములను పల్లకీలో ఊరేగింపుగా తీసుకెళ్లి భక్తలకు దర్శనాభాగ్యం కల్పించారు. ఈ వేడుకలను తిలకించేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. రాఘవేద్రుడిని దర్శనంతో తన్మయత్వం చెందారు. కార్యక్రమంలో ఆలయ పండితులు, భక్తులు పాల్గొన్నారు.