మహబూబ్నగర్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ లో వజ్రోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. ఎందరో త్యాగధనులు తమ ప్రాణాలు ఫణంగా పెట్టి స్వాతంత్య్రం సాధించారని తెలిపారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని జెడ్పీ మైదానంలో అధికార యంత్రాంగం చేపట్టిన ర్యాలీని కలెక్టర్ వెంకట్రా వు, ఎస్పీ వెంకటేశ్వర్లుతో కలిసి మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీకి విశేష స్పందన లభించింది.
జిల్లా కేంద్రంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు భారీగా ర్యాలీలో పాల్గొన్నారు. పోలీస్ బెటాలియన్కు చెందిన ప్రత్యేక దళం ద్విచక్రవాహనాలపై జాతీయ జెండాలతో ర్యాలీలో పాల్గొన్నారు. 1,500 మీటర్ల భారీ జాతీయ పతాకంతో విద్యార్థులు ప్రదర్శన చేపట్టారు. జెడ్పీ మైదానం నుంచి మినీ ట్యాంక్ బండ్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం రాకముందు తెల్లదొరలు మనల్ని బానిసలను చేసి మట్టి పె ట్టి రాజభోగాలు అనుభవించారన్నారు. గాంధీకి జరిగిన అవమానాన్ని భరించలేక స్వాతంత్య్ర ఉద్యమాన్ని ప్రా రంభించినట్లు వివరించారు.
ఈ ఉద్యమంలో చంద్రశేఖర్ ఆజాద్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్, జ్యోతిరావుఫూలే వంటి ఎందరో త్యాగధనుల వల్ల దేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్నారు. 75 ఏండ్లు అవుతు న్నా ఇంకా అసమానతలు పోవాల్సిన అవసరం ఉందన్నారు. కులమతాల జాడ్యాలను కూకటి వేళ్లతో పెకిలించాలన్నారు. దేశాన్ని పాలిస్తున్న నాయకులు అసమానతలను తొలగించాలని సూచించారు. చరిత్రను గుండె ల్లో పెట్టుకొని స్వాతంత్య్రోద్యమంలో పోరాటం చేసిన వారి త్యాగాలు వృథా కానీయమన్నారు. అన్ని వర్గాలకు చట్టసభల్లో స్థానం లభించేలా చూడాలని కోరారు. దేశ భవిష్యత్ యువత చేతుల్లోనే ఉన్నదని, భావితరాలకు మీరే మార్గదర్శకులుగా మారి ఇంకా ఏం సాధించుకోవాలో యువత ఆలోచించాల్సిన అవసరం ఉందన్నా రు. అందరికీ అన్ని రంగాల్లో అవకాశాలు దక్కాలన్నారు.
చెడుదారిన యువత..
వట్టి మాటలతో ట్విట్టర్లు, ఫేస్బుక్లలో మేసేజ్లతో యువత తప్పుదోవ పడుతున్నదని మంత్రి అన్నారు. ఉపాధి అవకాశాలు, వ్యవసాయం, మూడు పూటల తిండి, మహిళలు ఒంటరిగా అర్ధరాత్రి నడిచినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లని పేర్కొన్నా రు. లాభాలు వచ్చే పరిశ్రమలను నెలకొల్పి దేశం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలన్నారు. జీడీపీ, అభివృద్ధి, అత్యాచారాలు, వరకట్న వేధింపులు, మహిళలకు రక్షణ కల్పించడంలో ఏ స్థానంలో ఉందో గమనించాలన్నారు. తెలంగాణ వచ్చాకే అభివృద్ధి అంటే ఏందో చూస్తున్నామని, కరెంట్ తెచ్చుకున్నం, నీళ్లు తెచ్చుకున్నాం, విద్యా సౌకర్యాలు, ఉపాధి అవకాశాలు కల్పించుకొని ఒక్కో మెట్టు ఎక్కుతున్నామని మంత్రి తెలిపారు. కేసీఆర్ సీ ఎం అయ్యాక అభివృద్ధి బాటలో పయనిస్తుందన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, సీతారామారావు, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, నాయకులు గోపాల్యాదవ్, అబ్దుల్ రహమాన్, సుధీప్రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.