మహబూబ్నగర్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆల్ఇండియా రైఫిల్ అసోసియేషన్ మెంబర్ను.. ఏ తుపాకీ ఎట్ల ఉంటదో నాకు తెలుసు.. స్వయంగా ఎస్పీ వచ్చి ర్యాలీ ప్రారంభ సూచకంగా గాలిలో కాల్చండి.. అంటే పేల్చానని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శనివారం స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో జెడ్పీ మైదానం నుంచి మినీ ట్యాంక్బండ్ వరకు ర్యాలీ చేపట్టారు. ర్యాలీ ప్రారంభ సూచకంగా మంత్రి శ్రీనివాస్గౌడ్ రబ్బర్ బుల్లెట్ ఉంచి డమ్మీ రైఫల్తో గాలిలో కాల్చారు. అయితే కొన్ని టీవీ చానళ్లు దీన్ని వక్రీకరించాయి.
సోషల్ మీడియాలో కూడా తప్పుడుగా ట్రోల్ చేశారు. దీంతో మంత్రి పచ్చమీడియాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాను కాల్చింది నిజమైన బుల్లెట్ అయితే రాజీనామాకు సిద్ధమని.. కాదని తేలితే మీ చానల్ మూసుకుంటారా? అని సవాల్ విసిరారు. నేను కాల్చింది రబ్బర్ బుల్లెట్యే.. క్రీడా శాఖ మంత్రిగా నాకు అర్హత ఉందన్నారు. స్వయంగా ఎస్పీ ఇస్తేనే తీసుకొని గాలిలోకి ఫైరింగ్ చేశానని మంత్రి తెలిపారు.
దీపావళి కాల్చే తుపాకీలా శబ్దం వస్తుందన్నారు. కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఓ చానల్లో పోలీసోళ్లతో తుపాకీ లాక్కొని గాలిలోకి పేల్చినట్లు చిత్రీకరించారని ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంలో నేను ముందే విషం కక్కుతారని ముందే అనుకున్నట్లు తెలిపారు. కామన్వెల్త్ గేమ్స్లో కూడా ఇలా కాల్చడం ఆనవాయితీ అన్నారు. మీడియా వాస్తవాలు తెలుసుకోవాలని.. నన్ను, ఎస్పీని వివరణ అడగకుండానే ఇష్టమొచ్చినట్లు వ్యవహరించడం సరికాదన్నారు. నిజమైన తుపాకీ అయితే అలజడి రాదా..? అని ప్రశ్నించారు.
అది డమ్మీనే : ఎస్పీ
మహబూబ్నగర్లో ర్యాలీ ప్రారంభమైన సందర్భంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ వాడింది డమ్మీ తుపాకీ అని, అందులో ఉన్నది రబ్బర్ బుల్లెట్ అని ఎస్పీ వెంకటేశ్వర్లు ‘నమస్తే తెలంగాణ’కు వివరణ ఇచ్చారు. ర్యాలీ ప్రారంభం సమయంలో శబ్దం కోసం కాల్చినట్లు తెలిపారు. పోలీసులతో తుపాకీ లాక్కున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు. గుంజుకున్నట్లు వచ్చిన ఆరోపణలు అబద్ధం అని అన్నారు. మంత్రి కాల్చింది ఇన్సాస్ తుపాకీలో బుల్లెట్ లేని బ్లాంక్ ఆమ్యునేషన్ వాడారని ఎస్పీ తెలిపారు.