నెట్వర్క్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ); ఉమ్మడి జిల్లా పచ్చలహారంతో పరిఢవిల్లింది. 75వ స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వనమహోత్సవం పండుగను తలపించింది. ఖాళీ స్థలాలు, రోడ్లకిరువైపులా, కార్యాలయాల ఆవరణలో మొక్కలు నాటారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, వనపర్తి లక్ష్మీకుంట వద్ద ఫ్రీడం పార్కులో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఫ్రీడం పార్కుల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. పాలమూరులో పచ్చదనం పరిఢవిల్లుతున్నదని చెప్పారు. నాటిన మొక్కలకు కుటుంబ సభ్యుల పేర్లు పెట్టి సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఆయా నియోజకవర్గాల పరిధిలో ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజలు మొక్కల పండుగలో భాగస్వాములయ్యారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న వేళ భారత స్వతంత్ర వజ్రోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు
బుధవారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఫ్రీడం పార్కుల్లో మొక్కలు నాటారు. 75 అంకె ఆకారం వచ్చేలా మొక్కలను నాటి నీరు పోశారు. పల్లె ప్రకృతి వనం, బృహత్ పల్లె ప్రకృతి వనం, గ్రామీణ క్రీడా ప్రాంగణాల్లో పచ్చదనం సంతరించుకుంటున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు భాగస్వాములయ్యారు. స్వతంత్ర స్ఫూర్తిని చాటేలా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలన్నారు.