నాగర్కర్నూల్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ) : పురపాలికల్లో ప్లాస్టిక్ నిషేధం అమలవు తున్నది. పల్లెల్లోనూ నిషేధించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై గ్రామాల్లోనూ వాడి పడేసే ప్లాస్టిక్ కవర్లు, వస్తువుల అమ్మకాలు, కొనుగోళ్లు, జరిపినా.. ఉపయోగించినా అధికారులు రూ.2 వేలదాకా జరిమానాల విధించనున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసు కొంటున్నాయి. వస్త్ర, జనపనార బ్యాగులనే వాడాలని సూచిస్తున్నాయి.
గ్రామాల్లోనూ ప్లాస్టిక్ నిషేధం దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జూలై 1 నుంచి పురపాలికల్లో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వాడకం నిషేధం అమలవుతున్నది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధిస్తున్నది. కూరగాయల దుకాణాల నుంచి కిరాణాలు, హోటళ్లు, వస్త్ర వ్యాపారాలు.. పేర్లు ఏవైనా అమ్మే, కొనుగోలు చేసే వస్తుసామగ్రి, పార్సిళ్లు వంటి అన్నింట్లోనూ ప్లాస్టిక్ సంచులు, కవర్లు ప్రధానమయ్యాయి. ఇక తాగునీటిని సైతం వివిధ రకాల కంపెనీల బ్రాండ్లతో కవర్లలో విచ్చలవిడిగా వాడుతున్నారు. ఈ క్రమంలో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలు భారీగా పేరుకుపోతున్నాయి. పట్టణాలకే పరిమితమైన ప్లాస్టిక్.. మారిన కాలంతోపాటు పెరిగిన అవసరాలు, గ్రామాల అభివృద్ధితో పల్లెలకూ వచ్చాయి. దీంతో భూమి కలుషితమవుతున్నది.
భూసారం దెబ్బతింటున్నది. పంటల దిగుబడి తగ్గుతున్నది. కవర్లు తినడంతో గేదెలు, ఆవులు ఇచ్చే పాలు సైతం విషంతో సమానంగా మారుతున్నాయి. కవర్లు తినే జంతువుల మాంసాహారమూ ప్రమాదకరం. గ్రామాల్లోని మురుగు కాల్వల్లో కవర్లు పేరుకుపోయి పరిశుభ్రత లోపానికి కారణంగా మారుతున్నది. ఈ క్రమంలో గ్రామాల్లోనూ ప్లాస్టిక్ నిషేధించేందుకు పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఈనెల 22న జరిగే గ్రామసభల్లో ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. వాల్పోస్టర్లు, కరపత్రాలనూ పంపిణీ చేయనున్నారు. పంచాయతీల వద్ద నోటీసు బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే దుష్ఫరిణామాలను, వాడితే తీసుకోబోయే చర్యలనూ వివరించనున్నారు.
డీఆర్డీవో శాఖ ద్వారా మహిళా సంఘాలతో బట్ట, జనపనార సంచులను తయారీ చేయించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే దుకాణాల యజమానులకు కార్యదర్శుల ద్వారా నోటీసులు జారీ చేశారు. గ్రామాల్లో పారిశుధ్యం కోసం ఇంటింటికీ తిరిగి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరిస్తున్నారు. అయితే, ప్లాస్టిక్ కవర్లతో అధికంగా ఏర్పడుతున్న నిర్వహణ భారం దృష్ట్యా నిషేధానికే ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఇకపై గ్రామాల్లో ప్లాస్టిక్ వాడితే రూ.500నుంచి రూ.2వేల వరకు జరిమానా విధించనున్నారు. మొత్తమ్మీద పురపాలికల మాదిరిగానే పల్లెల్లోనూ ప్లాస్టిక్ నిషేధానికి జిల్లా పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవడం విశేషం.
వచ్చే నెల నుంచి నిషేధం..
నాగర్కర్నూల్ జిల్లాలోని 461 గ్రామ పంచాయతీల్లో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే దుకాణాదారులకు నోటీసులు జారీ చే శాం. ఈనెల 22న గ్రామ సభల్లో ప్రజల కు అవగాహన కల్పిస్తాం. ఎవరైనా కవర్లు వాడితే రూ.500 నుంచి రూ.2వేల వరకు జరిమానా విధిస్తాం. ప్రజలంతా బట్టలు, జనపనార సంచులను వాడాలి. ప్లాస్టిక్ కవర్లు వాడితే పర్యావరణం, భూసారం దెబ్బతిని వ్యవసాయంపై ప్రభావం చూపుతుంది. ప్లాసిక్ నిషేధానికి ప్రజలు సహకరించాలి.
– కృష్ణ, డీపీవో, నాగర్కర్నూల్