చేప పిల్లల పంపిణీకీ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. రాష్ట్ర స్థాయిలో ఉచితంగా అందించేందుకు శ్రీకారం చుట్టిన తర్వాత ఉమ్మడి జిల్లాలో ప్రారంభంకానున్నది. ఇందుకోసం ఆయా జిల్లాల మత్స్య శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందిన వెంటనే చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో చేపపిల్లలు విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. మత్స్యకారులకు 100 శాతం సబ్సిడీపై వీటిని అందించనున్నారు. ఇప్పటికే కొనుగోలుకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో అధికారులు ఏర్పాట్లు చేయడంతో మత్స్యకారుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది.
వనపర్తి(నమస్తే తెలంగాణ)/గద్వాల అర్బన్, ఆగస్టు 7: ఉచిత చేప పిల్లల పంపిణీకి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది ప్రభుత్వం సిద్ధమవుతున్నది. రాష్ట్రస్థాయిలో ఉచిత చేపపిల్లల పంపిణీని లాంఛనంగా ప్రారంభించిన అనంతరం వనపర్తి జిల్లాలో శ్రీకారం చుట్టనున్నారు. అందుకు సంబంధించిన ప్రక్రియను జిల్లా మత్స్యశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. ఆదేశాలు అందిన వెంటనే చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో చేపపిల్లలు విడుదల చేసేందుకు సమాయత్తమైనది. జిల్లాలో 229లక్షల చేపపిల్లలను అధికారులు సిద్ధంగా ఉంచారు. వర్షాలు సమృద్ధిగా కురవడంతో కుంటలు, చెరువులు, రిజర్వాయర్లలో సమృద్ధిగా నీరు చేరింది. దీంతో చేపపిల్లలను విడుదలచేస్తే దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశముందని అంచనాతో ఈ సమయాన్ని ఎంచుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఉచిత చేపపిల్లల పంపిణీకి రెండు సైజుల్లో సీడ్ను తెప్పించారు. 35 నుంచి 40ఎంఎం, 80 నుంచి 100ఎంఎం సైజును ఎంపిక చేశారు.
చేపపిల్లల పంపిణీకి టెండర్లు పూర్తి
వనపర్తి జిల్లా మత్స్యశాఖ చేపపిల్లల పంపిణీకి టెండర్లను పూర్తి చేసింది. ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా బిడ్లు దాఖలు చేసిన ఏజెన్సీల్లో ఆరు ఏజెన్సీలను ఎంపిక చేశారు. ఏజెన్సీల నుంచి ఫర్పార్మెన్స్ గ్యారెంటీ కింద ప్రభుత్వానికి టెండర్కు సంబంధించి రూ.59.31 లక్షలు చెల్లించి అగ్రిమెంట్ పూర్తిచేసుకోవాలి. ఈ ప్రక్రియ మొదటి వారంలో పూర్తికానున్నది. ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ ఫిషరీష్ అండ్ స్టేట్ ప్లాన్ 2022-23 స్కీం కింద మత్స్యకారుల కుటుంబాలకు చేయూతనివ్వడానికి ఉచిత చేపపిల్లల పంపిణీ చేపట్టారు. చేప విత్తనాన్ని జూన్లో వేయాల్సి ఉన్నప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ఆలస్యంగా విత్తనాలను అందజేస్తున్నారు. చేపపిల్లలను అందజేస్తారని తెలియడంతో మత్స్యకారులు అనందంలో ఉన్నారు.
మత్స్యకారులకు సబ్సిడీ పథకాలు
పేదరికంలో ఉన్న మత్స్యకారులను సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం అనేక రాయితీలను అందిస్తున్నది. వాహనాలను రాయితీపై సమకూర్చుతూనే చేపలు పట్టడానికి సబ్సిడీపై పనిముట్లు అందజేస్తున్నది. దీనికితోడు మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం వంటి చర్యలు చేపట్టింది. అదేవిధంగా చేపపిల్లలను ఉచితంగా అందజేస్తున్నది. సౌకర్యాలు కల్పించడంతో పరోక్షంగా, ప్రత్యక్షంగా లక్షలమంది మత్స్యకారులకు ఉపాధి లభిస్తున్నది. వనపర్తి జిల్లాలో చేపపిల్లలు పెంచడానికి 1017చెరువులు, కుంటలను ఎంపిక చేశారు.
వీటిలో 200లక్షల పిల్లలను వదలనున్నారు. జూరాల డ్యాంలో దాదాపు 8లక్షల చేపపిల్లలను వదలనున్నారు. వనపర్తి మత్స్యశాఖతోపాటు జూరాలలో నారాయణపేట, గద్వాల జిల్లా నుంచి చెరో 8లక్షల చేపపిల్లలను వదలనున్నారు. శ్రీశైలం బ్యాక్వాటర్లో 24లక్షల చేపపిల్లను వదిలేందుకు సీడ్ను టెండర్ పొందిన సంస్థలు సిద్ధం చేయాల్సి ఉంటుంది. కట్ల, రోగు, మెరిగల రకాల చేపపిల్లలను వదలనున్నారు. చెరువులు, కుంటల్లో చిన్న సైజు చేపపిల్లలను, రిజర్వాయర్లలో పెద్ద సైజు పిల్లలను వేయనున్నారు. రిజర్వాయర్ల వద్ద లైసెన్స్ ఉన్న మత్స్యకారులు మాత్రమే చేపలను పట్టాల్సి ఉంటుంది. జిల్లాలో 118మత్స్య సహకార సంఘాలు ఉండగా మరిన్ని దరఖాస్తు చేసుకొని అనుమతి
దశలో ఉన్నాయి.
జోగుళాంబ గద్వాల జిల్లాలో 16 రిజర్వాయర్లు, 411చెరువులు
జిల్లా వ్యాప్తంగా రెండు నదులతోపాటు 16 రిజర్వాయర్లు, 411చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటి పరిధిలో 50 మత్స్యసహకార సంఘలు ఉన్నాయి. 5,300మంది సభ్యులు కొనసాగుతున్నారు. భారీ వర్షాలు కురుస్తున్నందున జిల్లాలోని జలాశయాలు పూర్తిస్థాయి నీటిమట్టాలతో కళకళలాడుతున్నాయి. అన్ని జలాశయాల్లో దాదాపు కోటీ యాభై లక్షలకుపైగా చేపపిల్లలను వదిలేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చేపపిల్లల కొనుగోళ్లకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తికావడంతో చేపపిల్లలను వదలడంపై అధికారులు దృష్టి సారించారు.
ఏడాది పొడవునా ఉపాధి
కులవృత్తులకు అసరా కల్పించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఒక్కొక్కటీ దిగ్విజయంగా అమలవుతున్నాయి. అందులో భాగంగానే మత్స్యకారులను ఆదుకునేందుకు ఈ ఏడాది కూడా ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తున్నది. తద్వారా చేపల ఉత్పత్తులను గణనీయంగా పెంచి మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రభుత్వం ఆశిస్తున్నది. రూపాయి పెట్టుబడి లేకుండా నీటిపారుదల, గ్రామ పంచాయతీ చెరువుల్లో కోట్లలో చేపపిల్లలను వదలనున్నది. కులవృత్తిని నమ్ముకొని జీవనం సాగించే వారికి పెట్టుబడి లేకుండా ఆర్థికంగా ఆదుకునేందుకు ఈ పథకం ఎంతో దోహదపడుతున్నది. ఒక్కో సభ్యుడికి సీజన్లో సగటున వేల రూపాయలకు పైగా లబ్ధిచేకూరుతున్నది. ఈ సంవత్సరం కూడా ప్రతి సభ్యుడికి అదేస్థాయిలో ఆదాయం పొందేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రాంతానికి చెందిన చేపలు ఇతర రాష్ర్టాలకు సైతం ఎగుమతి అవుతున్నాయి. దీంతో చేపలను విక్రయించేందుకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించే దిశగా మత్స్యశాఖ చర్యలు తీసుకుంటున్నది.
పంపిణీకి ఏర్పాట్లు పూర్తి
చేపపిల్లల పంపిణీకి ఏర్పాట్లు పూర్తిచేశాం. వనపర్తి జిల్లాలోని అన్ని చెరువులకు చేపపిల్లలను పంపిణీ చేస్తాం. సీడ్స్ సప్లయి కోసం ఆరు ఏజెన్సీలను ప్రొక్యూర్మెంట్ ద్వారా ఎంపిక చేశాం. సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించి అగ్రిమెంట్ పూర్తయిన వెంటనే ఈ ఏడాది ఉచిత చేపపిల్లల పంపిణీకి శ్రీకారం చుడు తాం. మంత్రుల అపాయింట్మెంట్ తీసుకొని తేదీ ఖరారు చేస్తాం.
– రహమాన్, మత్స్యశాఖ అధికారి, వనపర్తి జిల్లా
మత్స్యకారులకు ఆర్థిక చేయూత
ఈ ఏడాది జలాశయాల్లో చేపపిల్లలు వదిలేందుకు టెండర్లు పిలిచి ప్రక్రియను పూర్తిచేశాం. త్వరలో ఉచితంగా మత్స్యకార్మికులకు పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. విడుతల వారీగా చేప పిల్లలను వదులుతాం. అలాగే సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా మత్స్యకార్మికులకు వాహనాలు, పుట్టీలు, వలలు సబ్సిడీపై అందిస్తున్నాం. మత్స్యకార్మికులు ఆర్థికంగా ఎదిగేలా ప్రభుత్వం చేయూతనిస్తుంది. ప్రభుత్వ సహకారాన్ని అందిపుచ్చుకొని మత్స్యకార్మికులు ఆర్థికంగా ఎదగాలి.
– రూపేందర్సింగ్, మత్స్యశాఖ అధికారి, జోగుళాంబ గద్వాల జిల్లా