వనపర్తి, ఆగస్టు 7 : తెలంగాణ రాకతో తండాల్లో గిరిజనుల ఆర్థికశక్తి పెరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. అమ్మఒడి, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి పథకాలతో గిరిజన బిడ్డలకు అండగా నిలస్తున్నాయన్నారు. ఆదివారం మహారాష్ట్రలోని థానే కేపీఆర్ డిగ్రీ కళాశాల, బొరివెళిలోని నలంద అకాడమీలో నిర్వహించిన వనపర్తి నియోజకవర్గ గిరిజన సోదరుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తండాల్లో అన్ని వసతులు కల్పిస్తున్నామని, మిగితా నియోజకవర్గాలకు భిన్నంగా అధిక సంఖ్యలో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించామన్నారు. వచ్చే రెండు, మూడేండ్లలో తండాల్లోని నిరుపేదలను గుర్తించి ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. పంద్రాగస్టు తర్వాత కొత్త పింఛన్లు, రేషన్ కార్డులు అందిస్తామన్నారు.
ఇప్పటికే 70 తండాలకు రహదారులను నిర్మించానని, మరో 20 రహదారుల నిర్మాణం త్వరలో ప్రారంభిస్తామని వివరించారు. ముంబయికి బస్సు ఏర్పాటు చేయిస్తానని, వనపర్తిలోని 108 తండాలకు రహదారులు నిర్మాణం పూర్తి చేయించే బాధ్యత నాదే అన్నారు. ముంబయిలో వనపర్తి వాసుల కోసం భవన నిర్మాణానికి నా సహకారం ఉంటుందన్నారు. ముంబయిలో ఉంటున్న మీకు మీ పక్కింట్లో తెలంగాణ మాదిరిగా ఎవరికైనా పింఛన్లు వస్తున్నాయా..? రైతుబంధు, రైతుబీమా ఉందా..? కల్యాణలక్ష్మి, కేసీఆర్ అమ్మ ఒడి అందుతున్నాయా..? ఏదీ ఇవ్వనోడు ఎగిరెగిరి పడుతున్నాడని ఎద్దేవా చేశారు. అయితే అన్ని ఇచ్చినా కేసీఆర్ మాత్రం ఇది మన కుటుంబం.. చక్కగా కుటుంబాలను చూసుకోవాలని సూచిస్తున్నారని చెప్పారు.
సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని, రాష్ట్రంలో చేసిన పనులు వంద ఉన్నాయని తెలిపారు. అదే ప్రధాని మోదీ చేసిన పని ఒక్కటైనా ఉందా..? చూయిస్తారా.. అని మంత్రి ప్రశ్నించారు. రైతుబంధు, రైతుబీమా, సాగునీరు, ఉచిత కరెంట్ వంటి పథకాలతో వ్యవసాయం బలపడిందన్నారు. నేను చదువుకున్నప్పుడు నాతోపాటు ఒక్క గిరిజన విద్యార్థి కూడా లేడని, కానీ నేడు తండాల్లో చదువుకోని విద్యార్థి ఎవరూ లేరన్నారు. గత ఎన్నికల సమయంలో వలసొచ్చిన మీరు వెనక్కి వస్తారని హామీ ఇచ్చానని, సాగునీటి రాకతోపాటు సంక్షేమ పథకాలు అందుతాయని, పొట్ట చేతపట్టుకొని మీరు వలస వెళ్లే పరిస్థితి ఉండవద్దని అన్నానని గుర్తు చేశారు. నాడు చెప్పిన ప్రకారంగా ఇప్పటి వరకు 70 శాతం హామీలు నెరవేరాయని చెప్పారు. నేడు మిమ్మల్ని కలుసుకోవడం కడుపు నిండినట్లుందన్నారు. కరోనా విపత్తు మూలంగా ఆర్థిక సమస్యలతో కొన్ని పథకాలు ఆలస్యమయ్యాయని, ప్రభుత్వం ఆ విపత్తు నుంచి త్వరగానే కోలుకున్నదన్నారు. ఇప్పటికే సాధ్యమైన పనులను చేశా.. మరిన్ని చేస్తానన్నారు.