జడ్చర్ల, ఆగస్టు 7 : జడ్చర్ల పట్టణంలోని సిగ్నల్గడ్డ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైల్వేబ్రిడ్జి కారణంగా జాతీయరహదారి విస్తరణ పనులు ముందుకు సాగకపోవడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతున్నది. వాహనాల రద్దీకి అనుగుణంగా రైల్వేబ్రిడ్జి లేకపోవడం, జాతీయరహదారి విస్తరణ పనులు నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్య నిత్యకృత్యంగా మారింది. జడ్చర్ల పట్టణం మీదుగా 167వ జాతీయరహదారిని నిర్మించడంతో ఇతర రాష్ర్టాలు, జిల్లాల కు వాహనాల రాకపోకలు పెరిగాయి. అలాగే సమీప గ్రామాల ప్రజలు, వ్యాపారు లు జడ్చర్లలో వస్తువుల కొనుగోలు, ఇతర పనుల నిమిత్తం వస్తుండడంతో వాహనాల రద్దీ పెరిగింది. దీనికితోడు ఎల్ఐసీ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తావరకు ప్రధానరహదారి గుంతలమయంగా మారడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గుంతలమయంగా మారిన రోడ్డుపై వాహనాలు నెమ్మదిగా వెళ్తుండడం, అంబేద్కర్, ఇందిరాగాంధీ చౌరస్తాల నుంచి వాహనాలు వస్తుండడం, మధ్యనున్న రైల్వేబ్రిడ్జి వాహనాల రద్దీకి అనుగుణంగా లేకపోవడంతో ట్రాఫిక్ నిలిచిపోతున్నది. సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కో రుతున్నారు. ఎంపీడీవో కార్యాలయం నుం చి ఇందిరాగాంధీ చౌరస్తావరకు రోడ్డు మధ్య లో బారికెడ్లను ఏర్పాటు చేస్తే కొంతవరకు ట్రాఫిక్ సమస్య తీరే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.