ఛిద్రమైన కులవృత్తులకు జీవం పోస్తూ తెలంగాణ సర్కార్ అండగా నిలుస్తున్నది. సబ్బండ వర్గాలకు వివిధ పథకాలతో ఉపాధికి బాటలు వేస్తున్నది. గొల్లకురుమలకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం రాయితీపై గొర్రెలను పంపిణీ చేస్తున్నది. ఇప్పటికే మొదటి విడుత పంపిణీ ప్రక్రియ పూర్తి కాగా రెండో విడుతకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. తొలి విడుతలో ఒక్కో యూనిట్ విలువ 1.25 లక్షలు ఉండగా రెండో విడుతలో మరో రూ.50 వేల రాయితీని పెంచి యూనిట్ విలువను 1.75 లక్షలుగా ప్రకటించింది. లబ్ధిదారులు తమ వాటా ధనం 25శాతం రూ.43,750 డీడీలు తీయాల్సి ఉంటుంది.
గద్వాల అర్బన్ ఆగస్టు 3: రాష్ట్రంలో ఛిద్రమైన కులవృత్తులకు తెలంగాణ ప్రభుత్వం జీవం పోస్తున్నది. సబ్బండ వర్గాలకు వివిధ పథకాలతో ఉపాధికి బాటలు వేస్తున్నది. ఉన్నచోట పని కల్పించడంతోపాటు వలస వెళ్లిన వారు తిరిగి పల్లెబాట పడుతున్నారు. గొల్ల కురుమలకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం రాయితీపై గొర్రెలను పంపిణీ చేస్తున్నది. ఇప్పటికే మొదటి విడుత గొర్రెల పంపిణీ ప్రక్రియను పూర్తిచేసిన ప్రభుత్వం.. లబ్ధిదారులకు రెండో విడుత గొర్రెలు పంపిణీ చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నది. తొలి విడుతలో ఒక్కో యూనిట్ విలువ రూ.1.25లక్షలుగా నిర్ణయించింది. ఇందులో రూ.93,750 ప్రభుత్వం సబ్సిడీగా అందించింది. రెండో విడుతలో మరో రూ.50వేల రాయితీని పెంచి యూనిట్ విలువను రూ.1.75లక్షలుగా ప్రకటించింది. ఇందులో లబ్ధిదారులు తమ వాటాధనం 25శాతం కింద రూ.43,750డీడీలు తీయాలి. 18సంవత్సరాలు నిండిన యాదవకురుమలకు సొసైటీలు సభ్యత్వం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో సొసైటీల సంఖ్య పెరిగింది.
రెండో విడుత ప్రణాళికలు సిద్ధం
రెండో విడుతకు ఎంపిక చేసిన గొర్రెల పెంపకందారులకు మరికొన్ని రోజుల్లోనే సబ్సిడీపై గొర్రెల పంపిణీ ప్రారంభం కానున్నది. మూడు, నాలుగు రోజుల కిందట పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో రెండో విడుత గొర్రెల పంపిణీకి సంబంధించి దిశానిర్ధేశం చేశారు. దీంతో ఆగస్టులో గొర్రెల పంపిణీకి జిల్లా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వినియోగదారులతో డీడీలకు సంబంధించి ఉన్నతాధికారుల నుంచి సమాచారం తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడ్డి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, 75శాతం రాయితీతో అందస్తున్నట్లు తెలిపారు. తొలి విడుతలో 13వేలకుపైగా, మలి విడుతలో 40వేలకుపైగా గొర్రెలు అందనున్నాయి. ఒక్కో యూనిట్కు 20గొర్రెలు, ఒక గొర్రెపోతు ఇవ్వనున్నారు. రెండో విడుతలో దాదాపు 40వేల మందికి పైగా గొర్రెల పంపిణీ చేయనున్నారు.
రెండో విడుతలో అదనపు రాయితీ
ప్రస్తుతం మార్కెట్లో జీవాలకు పెరిగిన ధరల దృష్ట్యా ప్రభుత్వం గొర్రెల యూనిట్ ధర విలువను పెంచింది. తొలి విడుతలో ఒక్కో యూనిట్ విలువను రూ.1.25లక్షలుగా నిర్ణయించి అందులో రూ.93,750 సబ్సిడీ అందించింది. రెండో విడుతలో రూ.50వేల రాయితీని పెంచి యూనిట్ విలువను రూ.1.75లక్షలుగా నిర్ణయించారు. అందులో లబ్ధిదారులకు తమ వాటాగా 25శాతం కింద రూ.43,750డీడీలు తీసేలా అవకాశం కల్పించింది. తొలి విడుతలో 13వేలకు పైగా మందికి అందాయి. రెండో విడుతలో 40వేల మందికిపైగా రాయితీ అందించినున్నట్లు అధికారులు తెలిపారు.
పారదర్శకత కోసం ప్రత్యేక యాప్
గొర్రెల కొనుగోలు, పంపిణీలో పారదర్శకత కోసం ప్రభుత్వం ప్రత్యే క యాప్ను రూపొందించింది. ఇక నుంచి కొనుగోలు చేసిన గొర్రెల సంఖ్యను ఈ యాప్లో నమోదు చేయడంతోపాటు లొకేషన్, గొర్రెల ఫొటోలను ఇందులో నిక్షప్తం చేస్తారు. కొనుగోలు సమయంలో గొర్రెలను వాహనంలో ఎక్కించే ఫొటోలు మొదలుకొని లబ్ధిదారుడి ఇంటికి చేర్చేవరకు వివరాలు, ఫొటోలు యాప్లో ఉంటాయి. లైవ్ వివరాలు, ఫొటోలను మాత్రమే యాప్ స్వీకరిస్తుంది.
త్వరలో పంపిణీ చేస్తాం
రెండో విడుత గొర్రెల పంపిణీ చేసేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. జిల్లాలో 55 వేలకుపైగా లబ్ధిదారులు ఉండగా తొలి విడుతలో 13వేల మంది లబ్ధ్దిదారులకుపైగా గొర్రెలు పంపిణీ చేశాం. ఇంకా రెండో విడుతలో 40వేలకు పైగా లబ్ధిదారులు ఉన్నారు. గతంలో ఎంపిక చేసిన వారికే గొర్రెలు పంపిణీ చేస్తాం. ప్రభుత్వ సూచనల మేరకు చర్యలు తీసుకుంటాం. యూనిట్ల పంపిణీకి సంబంధించిన తేదీల వివరాలు ఈ వారంలో ఖరారయ్యే అవకాశం ఉంది.
– డాక్టర్ వెంకటేశ్వర్లు, పశుసంవర్ధకశాఖ అధికారి, జోగుళాంబ గద్వాల జిల్లా