అయిజ, జూన్ 12: అల్ల నేరేడు పండును ఔషధ ఫలంగా పిలుస్తారు. ఈ పండు ఇటు వేసవి ముగింపు.. అటు వానకాలం ఆరంభానికి మధ్య మే, జూన్ మాసంలో విరివిగా లభిస్తాయి. వేసవిలో మనకెంతో ఉపయోగపడే పండ్లలో వగరు, తీపి, పులుపు మేళవింపు రుచితో ఉన్న అల్లనేరేడు పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వేసవిలో వేడి నుంచి ఉపశమనం, చలువను అందిస్తాయి. ఆకలిని పుట్టిస్తాయి. పైత్యాన్ని తగ్గిస్తాయి. విరోచనాలను నివారిస్తాయి. గుండె రక్తంలోని ఉష్ణాన్ని పోగొడతాయి.
భారతదేశాన్ని అనాదిగా జంబుద్వీపం అని పిలుస్తారు. జంబు అంటే నేరేడు చెట్టు అని అర్థం. భారతదేశం నేరేడు చెట్లతో నిండి ఉన్న ప్రదేశంలో సమృద్ధికరమైన భూగర్భజలాలు నిండి ఉంటాయనీ, దీని వల్ల పాడి పంటలు సస్యశ్యామలంగా వెల్లువిరుస్తాయనీ అర్థం. అందుకే సగర్వంగా ‘ జంబుద్వీపే భరతకండే ’ అని మన మంత్రాలలో చదువుతారు. నేరేడులోని అన్నీ ఔషధాలుగా మనకు ఉపయోగపడుతాయి. సంస్కృతంలో జంబు, సురభిపత్ర అనీ, హిందీలో జామూన్ అని, తెలుగులో కాకి నేరేడు, అల్ల నేరేడు అని, ఇంగ్లిష్లో జంబుల్ ద బ్లాక్ ప్లమ్ అని పిలుస్తారు. అల్ల నేరేడు కన్నా కాకి నేరేడు ఉన్నతమైంది. ఇది వగరు, పులుపు రుచులు కలిగి తీపిగా మారుతుంది. విశేషంగా మధుమేహ రోగాలను, శ్లేష్మ, పైత్యరోగాలు, హృదయరోగాలను హరింపచేసి శారీరక పుష్టిని కలిగిస్తుంది.
బాగా పండిన నేరేడు పండ్లను పిసికి గింజలు తీసి వేసి ఆ గుజ్జును తూకం వేసి, సమానంగా పటిక బెల్లం దానిలో కలిపి కరిగించి చిన్న మంటపైన పాకం వచ్చే వరకు మరిగించి దించి నిలువ చేసుకోవాలి. రోజూ రెండు చెంచాలు మోతాదుగా ఈ పాకాన్ని అరగ్లాసు మంచినీటిలో కలిపితే తీయని రుచికరమైన పానీయంగా ఉంటుంది. దీన్ని సేవిస్తే పొడిదగ్గు, రక్తక్షీణత గొంతు సమస్యలు నివారించవచ్చు.
అయిజ పట్టణంలో విక్రయిస్తున్న అల్లనేరేడు పండ్లకు భలే గిరాకీ ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అయిజ, కర్నూల్కు చెందిన వ్యాపారులు అల్లనేరేడు పండ్లను తోపుడు బండ్లపై అమ్మకాలు జరుపుతున్నారు. నిత్యం క్వింటాళ్ల మేరకు అమ్మకాలు జరుపుతున్నారు. కేజీ రూ.150 నుంచి రూ.200 వరకు విక్రయిస్తున్నారు. వానకాలంలో అల్లనేరేడు పండ్లు విధిగా తినాలనే కోరికలతో వినియోగదారులు పండ్లను అధిక సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారు.