గద్వాల, ఆగస్టు 17: స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఈనెల 21న హరితహారం కార్యక్రమం నిర్వహించి మొక్కలు నాటాలని రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి సూచించారు. బుధవారం మంత్రి అటవీశాఖ ప్రత్యేక అధికారి శాంతకుమారితో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వల్లూరు క్రాంతి, అదనపు కలెక్టర్ శ్రీహర్షతో కలిసి వీసీలో పాల్గొన్నారు.
మంత్రి మాట్లాడుతూ.. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా 21న ప్రత్యేక సమావేశాలకు బదులు రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం కార్యక్రమం కింద పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. 8వ విడుత హరితహారం కింద జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేసే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ.. 8వ విడుత హరితహారం కార్యక్రమం కింద జిల్లాలో 69,447 మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
మొక్కలు నాటే లక్ష్యాన్ని పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఆగస్టు 10న వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో మొక్కలు నాటామన్నారు. ఆగస్టు 21న జిల్లా వ్యాప్తంగా 255 పంచాయతీలు, నాలుగు మున్సిపాలిటీల్లో మొక్కలు నాటేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామని, ఉదయం 8గంటలకు ప్రజాప్రతినిధుల సమక్షంలో కార్యక్రమం ప్రారంభిస్తామని కలెక్టర్ తెలిపారు. ఆగస్టు 21న కార్యక్రమం పకడ్బందీగా అమలు చేసేందుకు మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలకు బాధ్యతలు అప్పగించి అనువైన స్థలాలను గుర్తించామని, గుంతల తవ్వకం ప్రక్రియ కొనసాగుతుందని కలెక్టర్ మంత్రి దృషి తీసుకెళ్లారు. వీడియో కాన్ఫరెన్స్లో డీపీవో శ్యామ్సుందర్, ఇన్చార్జి డీఆర్డీవో నాగేంద్రం, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.
బడి మానేసిన పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి బడిలో చేర్పించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో శిశు సంక్షేమశాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. జిల్లాలోని 14 ఏండ్లలోపు పిల్లలు బడి మానేసిన వారి జాబితాను హెచ్ఎంల నుంచి తీసుకొని గ్రామాల్లో విచారించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి తిగిరి పాఠశాలల్లో చేర్పించాలన్నారు.
పత్తి చేను, కూరగాయల మార్కెట్లలో ఇతర పనుల్లో పిల్లలను పెట్టుకోరాదని హెచ్చరించారు. గ్రామాల్లో రెవెన్యూ, పోలీస్శాఖల ఆధ్వర్యంలో టీంలుగా ఏర్పడి బడి మానేసిన పిల్లలు, వీధుల్లో తిరిగే పిల్లలను బడిలో చేర్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీహర్ష, ఆర్డీవో రాములు, డీఈవో సిరాజుద్దీన్, కార్మికశాఖ అధికారి మహేశ్కుమార్, స్త్రీ, శిశు సంక్షేమశాఖ అధికారి ముషాయిదా బేగం, సీడబ్ల్యూసీ చైర్మన్ సహదేవులు, హేమలత, నర్సింహ, శివకుమార్ పాల్గొన్నారు.
జిల్లాలో పట్టా భూముల సమస్యలు ఎక్కువ ఉన్న సందర్భాల్లో తాసిల్దార్లు చొరవ తీసుకుని కారణాలను పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లాలోని తాసిల్దార్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ధరణి టీఎం 33లో పరిష్కరించాల్సిన సమస్యను పేర్లు, విస్తీర్ణం, మిస్సింగ్ సర్వే నెంబర్లు ఇతరములు అన్నింటికీ సంబంధించి పెండింగ్లో ఉన్నవాటిని మండలాలవారీగా క్లియర్ చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీహర్ష, ఆర్డీవో రాములు, సీ సెక్షన్ సూపరింటెండెంట్, తాసిల్దార్లు పాల్గొన్నారు.