కోడేరు, ఆగస్టు 17: తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు పండక వ్యవసాయపొలాలు బీళ్లుగా మారడంతో పాటు చెరువులు, కుంటలు పూర్తిగా ఒట్టిపోయాయి. కరువు పరిస్థితులకు తట్టుకోలేని రైతులు బతుకుదెరువు కరువై పల్లెలు విడిచి పట్నం వలసబాట పట్టారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన నిధులను కేటాయించింది.
అందులో భాగంగానే మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం(ఎంజీకేఎల్ఐ) రెండో లిప్టులో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తిచేయించింది. దీంతో నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ప్రాంతం సస్యశ్యామలంగా మారి పసిడి పంటలతో కళకళలాడుతున్నాయి. నాడు కరవును చూసిన రైతు నేడు పచ్చని పంటలు, చెరువులు, కుంటల్లో నిండుకుండలా నీళ్లు ఉండటం చూస్తున్నారు. బీడు భూములు సైతం సాగులోకి వచ్చి పొలాలన్నీ పచ్చబడ్డాయి.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టు నిధుల కొరతతో చతికిలపడింది. పనులను పూర్తి చేయకుండానే వదిలేశారు. దీంతో కొల్లాపూర్ నియోజకవర్గంలోని జొన్నలబొగుడ రిజర్వాయర్ వద్ద ఉన్న రెండో లిప్టులో అసంపూర్తిగా ఉన్న పనులపై భారీ నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్రావు 18సార్లు పర్యటించి చివరికి ప్రాజెక్టు వద్దనే బస చేశారు. అందులో భాగంగా ఎంజీకేఎఎల్ఐ రెండో లిప్టులో ఐదు మోటర్లను ఏర్పాటు చేసేందుకు రాత్రింబవళ్లు పనులు చేయాలని నాడు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి హరీశ్రావు కాంట్రాక్టర్లపై ఒత్తిడి తీసుకొచ్చారు. తీరా పనులు పూర్తి చేసుకొని రెండో లిప్టులో ఐదే మోటార్లను అమర్చి 2016ఆగస్టు 28న అర్ధరాత్రి 11:30గంటలకు సాగునీటిశాఖ అధికారులు ట్రయల్న్ చేశారు.
చివరికి అధికారికంగా అదే ఏడాది సెప్టెంబర్ 8న మంత్రి హరీశ్రావుతోపాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు జొన్నలబొగుడ రిజర్వాయర్లోని నీటిని విడుదల చేశారు. దీంతో నాటి నుంచి నేటివరకు కృష్ణాజలాలు కాల్వల వెంట పరుగులు తీస్తున్నాయి. కృష్ణమ్మ రాకతో ఇక్కడ కరువును తరమింది. ఇదిలా ఉండగా కోడేరు మండలంలో బ్రాంచి కాల్వ పంట కాల్వల ద్వారా 32కుంటలు ఐదు చెరువులను నీటితో నింపారు. దీంతో దాదాపుగా 15నుంచి 18వేల ఎకరాల ఆయకట్టు భూములు సాగులోకి వచ్చాయి.
అలాగే పెద్దకొత్తపల్లి మండలంలో నాలుగు చెరువులు, 16కుంటలను కృష్ణా జలాలతో నింపారు. 15వేల ఎకరాల ఆయకట్టు భూములకు సాగునీటి సౌకర్యం కల్పించారు. పాన్గల్ మండలంలో 3చెరువులు, 18 కుంటలను నింపారు. దీంతో 16వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించారు. కొల్లాపూర్ మండలంలోని సింగోటం, ఎల్లూర్ రిజర్వాయర్ కింద 13వేల ఎకరాలకు సాగునీరు అందించారు. ఆరేండ్లుగా ఏడాదికి రెండు పంటలు వరి, వేరశనగ పంటలను రైతులు పండిస్తున్నారు. పంటలు పండి పొలాలు పచ్చబడటంతో అన్నదాతలు ఆనందంతో ఉన్నారు.
జొన్నలబొగుడ రిజర్వాయర్ కింద నీళ్లు రావడంతో రెండేండ్లుగా వరి పంట సాగు చేస్తున్నా. గతంలో నీటివసతి లేక కుటుంబంతో వలస వెళ్లాను. ఆరేండ్ల కిందట నీళ్లు రావడంతో వ్యవసాయం చేస్తున్నాను. ఇంటివద్దనే ఉండి సేద్యం చేస్తున్నా.
– ఆది బుడ్డయ్య, రైతు, ఖానాపూర్
ఎత్తం పెద్ద చెరువు కింద మూడెకరాల భూమి ఉంది. రెండేండ్ల నుం చి చెరువులకు నీళ్లు వదిలారు. దీం తో వరి పంట వేశాను. ఎంతో సం తోషంగా ఉంది. కాల్వ ద్వారా చె రువులకు నీళ్లు వచ్చాయి. అందరం ఇంటివద్దనే ఉండి వరి పంట సాగు చేశాము.
– వెంకటయ్య, రైతు, ఎత్తం