డయాలసిస్ బాధితులకు ప్రభుత్వం తీపి కబురును అందించింది. అందరికీ ఆసరా పింఛన్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఒక్కో కిడ్నీ బాధితుడికి రూ.2,016 పంపిణీ చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో 579 మంది ఉన్నారు. వారం రోజుల్లో లబ్ధిదారుల ఎంపిక కోసం అవసరమైన దరఖాస్తులను జిల్లా యంత్రాంగం స్వీకరించనున్నది. దీంతో తమకు ఆసరాతోపాటు రవాణా ఖర్చుల భారం తీరనున్నదని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొండంత అండగా నిలిచిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఆగస్టు 17: స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ప్రభుత్వం 57ఏండ్లు నిండిన వారికి పింఛన్లు మంజూరు చేయడంతో పాటు రాష్ట్రంలో ఉన్న ప్రతి డయాలసిస్ బాధితుడికీ రూ.2016 ఆసరా పింఛన్ అందజేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ప్రకటించడంతో బాధితులకు ఆర్థికంగా కష్టాలు తీరనున్నాయి.
ప్రభుత్వ ప్రకటన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా డయాలసిస్ బాధితులకు వరంగా మారనున్నది. కొత్తగా ఆసరా పింఛన్ ఇవ్వనున్నామని అందులో డయాలసిస్తో బాధపడుతున్నవారికి రూ.2016 అందిస్తామని సీఎం చెప్పడంతో ఉమ్మడి జిల్లాలోని 579 మందికి ఈ ప్రయోజనం చేకూరనున్నది. నెలలో పలుమార్లు డయాలసిస్ కోసం వెళ్లేవారికి ఆర్థికంగా ఆసరా కానున్నది. వారం రోజుల్లో లబ్ధిదారుల ఎంపికకు అవసరమైన దరఖాస్తులను జిల్లా యంత్రాంగం స్వీకరించనున్నది. ఇందుకు మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖానతోపాటు ఎస్వీఎస్ ఇతర ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స పొందేవారు, పింఛన్కు దరఖాస్తు చేసుకునే వీలుంది.
ఉమ్మడి జిల్లాలోని డయాలసిస్ బాధితులు దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్నారు. కిడ్నీలు చెడిపోవడంతో చికిత్స అనివార్యంగా మారి సమీపంలో డయాలసిస్ కేంద్రాలకు వెళ్లడానికి కూడా రవాణా ఖర్చులకు డబ్బులు లేక ఇప్పటి వరకు ఇబ్బందులు పడుతూ వచ్చారు. మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో ఆరు మిషన్ల ద్వారా 43మంది డయాలసిస్ సేవలు పొందుతున్నారు. దీంతోపాటు నాగర్కర్నూల్ జిల్లాలో 5 మిషన్లతో 49మంది, వనపర్తిలో 10మిషన్ల ద్వారా 93 మంది, గద్వాల జిల్లా దవాఖానలో 8మిషన్ల ద్వారా 105 మంది, నారాయణపేటలో మూడు మిషన్ల ద్వారా 23మంది డయాలసిస్ చేయించుకుంటున్నారు.
మహబూబ్నగర్, నారాయణపేట, నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ జనరల్ దవాఖానల్లో డయాలసిస్ కేంద్రాలు ఉన్నాయి. బాధితులు స్వగ్రామాల నుంచి తమకు కేటాయించిన రోజు కేంద్రాలకు వెళ్లి రక్తశుద్ధి చేయించుకుంటున్నారు. వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని డయాలసిస్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా బస్పాస్ అందిస్తున్నది. పరిస్థితి తీవ్రతను బట్టి నెలకు ఎనిమిది సార్లు డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తుంది.
వారికి కేంద్రాల్లో మందులను ఉచితంగానే ఇస్తున్నారు. కానీ వారిలో చాలా మందికి బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి ఇతర జబ్బులు కూడా ఉంటాయి. వీటికి నెలకు రూ.వెయ్యి నుంచి రూ.2వేల వరకు మందులకు ఖర్చు అవుతున్నది. చాలా మందికి పనిచేసే పరిస్థితి కూడా ఉండదు. అత్యధికులు పేదలే కావడంతో కుటుంబాలకు మందుల ఖర్చు భారంగా మారుతోంది.
ఆసరా పింఛన్ అందితే ఆయా కుటుంబాలకు డయాలసిస్ బాధితులకు పోషకాహారం, మందులు కొనుగోలు చేసేందుకు ఎంతో ఉపయోగపడనున్నది. ప్రభుత్వ దవాఖానలతోపాటు ప్రైవేట్లోనూ డయాలసిస్ చేయించుకుంటున్న వారు ఉమ్మడి జిల్లాలో 616 మంది ఉండగా ఇందులో 579మంది సాధారణ ప్రజలు, 37 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన పింఛన్ విధానం వీరికి వరిస్తుందా..లేదా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
అర్హులైన డయాలసిస్ బాధితులందరికీ ఆసరా పింఛన్లు వచ్చేలా చర్యలు చేపడుతాం. ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు రాగానే డయాలసిస్ రోగులను గుర్తించి వారి వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తాం. మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో చికిత్స పొందుతున్న వారి వివరాలను సేకరించాం.
– డాక్టర్ కృష్ణ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి