మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఆగస్టు 17: పదో తరగతి పూర్తయిన ఓ విద్యార్థిని చెట్టుకు ఉరేసుకొని అనుమానాస్పదంగా మృతిచెందిన ఘటన మంగళవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. మహబూబ్నగర్ రూరల్ పోలీసు స్టేషన్ ఎస్సై వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. మహబూబ్నగర్ మండలంలోని మాచన్పల్లి గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని (17)పదో తరగతి వరకు చదివింది.
అదే గ్రామానికి చెందిన దర్పల్లి వెంకటేశ్ అతని అన్న మొగులయ్య ఇద్దరు ఈ నెల 15న అమ్మాయిని ఇంటి వద్ద ఎవరూ లేని సమయంలో మాయమాటలు చెప్పి ఉదయం 11 గంటల సమయంలో బలవంతంగా బైక్పై తీసుకువెళ్లినట్లు స్థానికంగా ఉండే ఓ అమ్మాయి తెలిపింది. విషయం అమ్మాయి తల్లిదండ్రులకు తెలియడంతో ఎక్కడ వెతికినా ఆచూకీ తెలియలేదు. అనుమానంతో మొగులయ్యకు ఫోన్ చేయగా రాత్రి 8గంటల వరకు అమ్మాయిని తీసుకొస్తామని కోపంతో చెప్పినట్లు తెలిపింది.
ఈక్రమంలో మంగళవారం సాయంత్రం గ్రామ శివారులోని మాచన్పల్లి వద్ద కానుగ చెట్టుకు చున్నీతో ఉరివేసి మృతదేహం వేళాడుతూ కనిపించింది. ఆమె తండ్రి కిందకి దింపి చూడగా అప్పటికే చనిపోయినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ జనరల్ దవాఖానకు తరలించారు.
మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు వెంకటేశ్ తన కూతురిని ప్రేమ పేరుతో వేధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆమె చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.