వనపర్తిటౌన్, ఆగస్టు 11: సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ విస్తరిస్తున్నందున ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తం గా ఉండాలని కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా అన్నారు. జిల్లాకేంద్రంలోని సాయి గార్డెన్లో గురువారం సైబర్థాన్ నిర్వహించారు. సైబర్నేరాల అవగాహనపై ప్రత్యేకంగా రూపొందించిన పాఠ్యపుస్తకాన్ని కలెక్టర్ విడుదల చేసి మాట్లాడారు. గాంధీజీ కలలుగన్నట్లు 75వ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో మనం ఉన్నామని, గాంధీజీ చెప్పినట్లు అర్ధరాత్రి మహిళలు ఇంటికి సురక్షితంగా వచ్చినప్పుడే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లని చెప్పారని గుర్తుచేశారు.
ప్రతి విద్యార్థికి మంచి, చెడులపై తెలియాల్సిన అవసరం ఉందన్నారు. సైబర్ నేరాలకు పాల్పడే వారు క్రిమినల్సేనన్నారు. ఆన్లైన్ ద్వారా ఉమెన్ సేఫ్టీవింగ్, తెలంగాణ పోలీస్, పాఠశాల విద్య సంయుక్త ఆధ్వర్యంలో సైబర్నేరాలపై జిల్లాలో 50పాఠశాలల నుంచి 50మంది ఉపాధ్యాయులు, 100మంది విద్యార్థినులకు 10నెలలుగా ఆన్లైన్ శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. జూలై 17నుంచి 31వరకు ఆన్లైన్ ద్వారా ప్రతిభా పరీక్షలు నిర్వహించామని, పరీక్షలో 10మంది విద్యార్థులు ప్రతిభ కనబర్చారని తెలిపారు.
అందులో ఆత్మకూర్ జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని అక్షయ ప్రథమ, డీ గీత ద్వితీయ బహుమతి సాధించారన్నారు. తృతీయ స్థానంలో మస్తాన్పూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన చందు నిలిచారు. వారికి మెమెంటో, ప్రశంసాపత్రాలను అందజేశారు. మరో ఏడుగురికి ప్రశంసాపత్రాలను అందజేసినట్లు తెలిపారు. అనంతరం సైబర్ కాంగ్రెస్ గ్రాండ్ ఫినాలేపై ప్రొజెక్టర్ ద్వారా అవగాహన కల్పించారు.
సమావేశంలో ఏఎస్పీ షాకీర్హుస్సేన్, డీఎస్పీ ఆనంద్రెడ్డి, డీఈవో రవీందర్, బాలికల విద్యాభివృద్ధి అధికారిణి సుబ్బలక్ష్మి, మహిళ, శిశు సంక్షేమశాఖ అధికారిణి పుష్పలత, ఎస్సై అంజద్, షీటీం ఎస్సై స్వాతి, సైబర్ క్రైం ఎస్సై వేణు, షీటీం సిబ్బంది శ్రీనివాసులు, కృష్ణ, వెంకటస్వామి, గోవింద్, రవీందర్బాబు, విజయ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.