మహబూబ్నగర్ మెట్టుగడ్డ/పాలమూరు, ఆగస్టు 11 : ఫ్రీడమ్ రన్.. తెలంగాణ అభివృద్ధి పరుగు అని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. నేడు అన్ని రంగాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. గురువారం మహబూబ్నగర్ జెడ్పీ మైదానం నుంచి బీఈడీ కళాశాల మైదానం వరకు సుమారు 5 వేల మంది ఉద్యోగులు, యువత, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, పోలీసులు, ఇతర వర్గాలతో నిర్వహించిన ఫ్రీడమ్ రన్ను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం బీఈడీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మహనీయుల త్యాగాల ఫలితమే స్వాతంత్య్రమని చెప్పారు.
దీన్ని ఆధారం చేసుకుని దేశం, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధిలో పరుగులు పెడుతున్నదని తెలిపారు. ము ఖ్యంగా కామన్వెల్త్ గేమ్స్లో దేశంలోనే రెండో స్థానం లో నిలిచిందన్నారు. క్రీడా శాఖ మంత్రిగా ఇది తనకు ఎంతో గర్వంగా ఉందన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటికీ ఇంకా సమాజంలో కులమతాలు, అసమానతలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇవన్నీ అభివృద్ధికి నిరోధకాలుగా మారుతున్నాయని చెప్పారు. మనుషులంతా ఒ క్కటే అన్న భావన ఉన్న నాడే దేశం ఐకమత్యంగా ఉం డటమే కాకుండా, జాతీయ సమైక్యత సాధ్యమవుతుందన్నారు.
నాడు మహబూబ్నగర్ జిల్లా తాగునీటికి, ఆకలికి, వలసలకు పెట్టింది పెరని, నేడు స్వయం స మృద్ధి సాధించడమే కాకుండా ప్రతి రోజూ శుద్ధ జలాలు అందుతున్నాయని వివరించారు. జిల్లాలో మెడికల్ కళాశాల, నెక్లెస్ రోడ్లు, బైపాస్ రోడ్డు, జంక్షన్ల అభివృద్ధిని చేసినట్లు తెలిపారు. రూ.300 కోట్లతో పాత కలెక్టరేట్ స్థానంలో సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. యువతకు ఉపాధి కల్పించామని, నేడు జిల్లాకే వలసలొచ్చే పరిస్థితి ఏర్పడిందన్నారు.
శుక్రవారం రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రజలకు మంత్రి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, సీతారామారావు, ఏఎస్పీ రాములు, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, ముడా చైర్మన్ వెంకన్న ముదిరాజ్, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేశ్, డీఎస్పీ మహేశ్, ఎంవీఐ నరేశ్, టీజీవో జిల్లా అధ్యక్షడు రాజగోపాల్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు రాజీవ్రెడ్డి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.