అచ్చంపేటరూరల్, ఆగస్టు 5: దేశంలో ప్రతిపండుగకు విశిష్టత ఉంటుంది. అదేవిధంగా బంజారా పండుగలు సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయి. అందులో భాగంగా పెండ్లికాని యువతులకు తీజ్ మొలకల పండుగ కలల పండుగ అని చెప్పవచ్చు. గిరిజనుల (లంబాడా) తీజ్ ఉత్సవాలకు నల్లమలలో ప్రత్యేక ప్రాధాన్యత ఉన్నది. గిరిజన యువతులు తమ తండాల్లో నిర్వహించే పురాతన విధానాలకు పెద్దపీట వేస్తున్నారు. మహిళలు, యువతులు, యువకులు సాంప్రదాయ నృత్యాలు, ఆటపాటలతో తొమ్మిది రోజులపాటు జరుపుకొనే వేడుక. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు బాగుండాలని చేసుకునే పండుగ. అనాదిగా గిరిజనులు సాంప్రదాయంగా నిర్వహిస్తున్న పండుగల్లో తీజ్కు ప్రత్యేక స్థానం. తీజ్ను కేవలం తండాల్లో పెండ్లికాని గిరిజన యువతులు మాత్రమే ముందుండి నిర్వహిస్తుంటారు. శ్రావణమాసం ప్రారంభం, వ్యవసాయ పనుల తీరిక వేళలో తీజ్ను నిర్వహిస్తుంటారు. తండాలోని పెద్ద సూచన మేరకు పండుగ జరుపుకొనే రోజును నిర్ణయిస్తారు. అనంతరం తండాల్లో టాంటాం వేయిస్తారు. ఇంటింటికీ తిరిగి బియ్యాన్ని సేకరించి చివరి రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు.
యువతులు తెల్లవారుజామునే స్నానమాచరించి సోదరులతో కలిసి సమీపంలోని అటవీప్రాంతానికి వెళ్లి పుట్టమన్ను తెచ్చి పుశువుల ఎరువు కలుపుతారు. తండాలోని పెద్దతో బుట్టలో మట్టిని వేయించి అందులో గోధుమలను చల్లిస్తారు. అదేవిధంగా వెదురు, దుసురుతీగతో తయారు చేసిన చిన్న బుట్టల్లో గోధుమ గింజలను కలుపుతారు. ఇలా తయారు చేసిన బుట్టలను తండా పెద్ద ఇంటి ఎదుట వెదురు బొంగులతో ఏర్పాటు చేసిన మంచంపై పెడుతారు. బుట్టల్లో మొలకలు వచ్చే వరకు తొమ్మిది రోజులపాటు నిత్యం మూడుసార్లు వాగు, బావుల నుంచి నీళ్లు తెచ్చి బుట్టలపై చల్లుతారు.
ఈ తొమ్మిదిరోజులు యువతులు ఉపవాసం ఉండి సప్పటి అన్నం మాత్రమే తీసుకుంటారు. ఏడు రోజులు నీళ్లు పోసిన తర్వాత గణగోర్ చేస్తారు. పెండ్లి కాని యువతులు మంచి భర్త రావాలని సేవాలాల్ మహరాజ్, దండిమేరామయాడీలను నిష్టతో పూజించి తీజ్ పండుగ నిర్వహిస్తారు. అనంతరం తండా సమీపంలోని వాగుల్లో నిమజ్జనం చేస్తారు. బుట్టలో గోధుమనారు ఎంత పచ్చగా పెరిగితే అంత శుభం కలుగుతుందని గిరిజన యువతుల నమ్మకం. ఎనిమిదో రోజు పెండ్లి కాని యువతులు ఒకచోట చేరి పుట్టమన్నుతో అబ్బాయి, అమ్మాయిల బొమ్మలను తయారు చేసి వాటిని తండాలోని ఆలయం వద్ద ఉంచి పూజలు చేస్తారు.
యువతులు తండాలో ఇంటింటికీ తిరిగి బియ్యాన్ని పోగుచేసి సేవాలాల్, దండిమేరమయాడీలకు నైవేద్యం సమర్పిస్తారు. అనంతరం తండావాసులకు అన్నదానం చేస్తారు. తొమ్మిదోరోజు గిరిజన వేషధారణలో దుస్తులు, ఆభరణాలు ధరించి తండా పెద్ద ఇంటి వద్దకు చేరుకుంటారు. అక్కడ సాంప్రదాయ పాటలు, ఆటలు ఆడి నృత్యాలు చేస్తారు. సాయంత్రం యువతులకు కుటుంబసభ్యులు, బంధువులు కానుకలను అందజేస్తారు. అనంతరం యువతులు ప్రతిఫలంగా గోధుమ మొలకలను అందజేస్తారు. అంతటితో తీజ్ వేడుకలు ముగిసినట్లు తండా పెద్ద ప్రకటిస్తారు.