మూసాపేట(అడ్డాకుల), ఆగస్టు 4 : అడ్డాకుల మండలం బలీదుపల్లి గ్రామ పరిసర ప్రాంతంలో గురువారం భారీ వర్షం కురిసింది. జాతీయ రహదారి నుంచి బలీదుపల్లి, వర్నె, ముత్యాలంపల్లి, కన్మనూరు గ్రామాలకు వెళ్లే ప్రధాన రోడ్డు మధ్యలో ఉన్న గాజులవంపు ఉధృతంగా ప్రవహించింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామ పంచాయతీ భవనంతోపాటు పలు ఇండ్లల్లోకి నీరు చేరింది. వర్నె వాగులో ఉన్న మట్టి రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.
బాలానగర్, ఆగస్టు 4: మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం గంట సేపు, సాయంత్రం వాన పడడంతో పలు చోట్ల పంట పొలాలు నీట మునిగాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
జడ్చర్ల, ఆగస్టు 4: దుందుభీ వాగు పరవళ్లు తొక్కుతున్నది. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి జలకళ సంతరించుకున్నది. నవాబ్పేట, బాలానగర్, రాజాపూర్, జడ్చర్ల మండలాల పరిధిలో నిండుగా పారుతున్నది. లింగంపేట, నెక్కొండ, కుర్వగడ్డపల్లి, గుట్టకాడిపల్లి గ్రామాల శివారులోని చెక్డ్యాంలు నిండాయి. రెండు ఫీట్ల ఎత్తుమేర అలుగులు పారుతున్నాయి. ఈ వానకాలం సీజన్లో ఇప్పటికే మూడుసార్లు వాగు పారింది. దీంతో వాగు పరిసర గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈర్లపల్లి, కోడ్గల్ నుంచి గుట్టకాడిపల్లి పరిధిలోని వాగులోకి ఎవరూ వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. ఆయా గ్రామాల కార్యదర్శులు సిబ్బందిని కాపలా ఉంచినట్లు తెలిపారు.
నవాబ్పేట, ఆగస్టు 4: నవాబ్పేట మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. కుంటలు అలుగులు పారుతుండగా పెద్ద చెరువుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 7.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వివరించారు. నవాబ్పేట శివారులోని తాళ్లవాగుకు వరద పోటెత్తింది. దీంతో నవాబ్పేట, మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి గల ప్రధాన రోడ్డు పై రాకపోకలు నిలిచిపోయాయి. ఎస్సై శ్రీకాంత్, స్థానిక ప్రజాప్రతినిధులు రక్షణ చర్యలు చేపట్టారు.
గండీడ్, ఆగస్టు 4: మండలంలో పలు చోట్ల భారీ వర్షంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పొలాలు నీటితో నిండుకుండలను తలపించాయి. మండలంలోని కొండాపూర్ వాగు పొంగి పొర్లడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మండలంలో పెద్దవాగు ఉధృతంగా ప్రవహించింది.