మల్దకల్, జూలై 28: ఆదిశిలా క్ష్రేతంలో వెలిసిన స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వర ఆలయం అమావాస్యను పురస్కరించుకొని గురువారం భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా స్వామి వారికి ఉదయం అర్చకులు రవిచారి, రమేశ్చారి, మధుసూదన్చారి ఆధ్వర్యంలో బిందెసేవా, పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రాత్రి ఆలయంలో మల్దకల్, పెద్దొడ్డి గ్రామాలకు చెందిన భజన మండళ్లు ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం కాకతీయ టెక్నో పాఠశాల ఆధ్వర్యంలో, రాత్రి శాంతినగర్కు చెందిన శివశివానీ టెక్నో పాఠశాల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చైర్మన్ ప్రహ్లాదరావు, ఈవో సత్యచంద్రారెడ్డి ఏర్పాట్లు చేశారు.
అయిజ, జూలై 28: అయిజ పట్టణంలోని తిక్కవీరేశ్వర స్వామికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. గురువారం అమావాస్యను పురస్కరించుకొని తిక్కవీరేశ్వరస్వామిని ప్రత్యేక అలంకరణ చేశారు. ఈ సందర్భంగా భక్తులు ఆలయానికి చేరుకుని పూజలు చేశారు. ఉదయం తిక్కవీరేశ్వరస్వామికి అభిషేకం, అలంకరణ, పుష్పాభిషేకం, అర్చనలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నదానం చేశారు. అలాగే అయిజ పట్టణంలోని స్వయంభూ కట్టకింద తిమ్మప్ప స్వామి, వీరబ్రహ్మేంద్ర శివరామాంజనేయస్వామి, ఉత్తనూర్ ధన్వంతరి వేంకటేశ్వరస్వామి, తుపత్రాలలోని ఆంజనేయస్వామి ఆలయాల్లో భక్తులు పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సరిహద్దులోని రాయచూరు ప్రాంతంలో వెలిసిన పంచముఖ ఆంజనేయస్వామికి భక్తులు పోటెత్తారు. గురువారం అమావాస్య కావడంతో తెలంగాణ, కర్ణాటక, ఏపీ రాష్ర్టాలకు చెందిన భక్తులు పంచముఖ ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు దేవస్థాన అర్చకులు స్వామికి అభిషేకం, ఆకుపూజ, పుష్పాభిషేకం నిర్వహించారు. ప్రతి అమావాస్యకు ఆంజనేయస్వామికి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకోవడవం ఆనవాయితీగా వస్తోంది. తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర రాష్ర్టాల భక్తులు అశేషసంఖ్యలో తరలివచ్చి పంచముఖి ఆంజనేయస్వామిని దర్శించుకుని పూజలు చేశారు. సాయంత్రం ఆంజనేయస్వామికి దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో రథోత్సవాన్ని నిర్వహించారు.
ఉండవెల్లి, జూలై 28: మండలంలోని డీ బుడిదపాడు ఆంజనేయస్వామి ఆలయంలో అమావాస్యను పురస్కరించుకొని భక్తులు స్వామివారికి ఆకుపూజ, కుంకమార్చనలు, అభిషేకాలు, పల్లకీసేవ నిర్వహించారు. అలంపూర్, ఉండవెల్లి, మానవపాడు మండలాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ నిర్వాహకులు 5వేల మంది భక్తులకు అన్నదానం చేశారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి.
రాజోళి, జూలై 28: రాజోళి మండలకేంద్రంలో అమావాస్యను పురస్కరించుకొని ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం అంజనేయ స్వామి ఆలయాల్లో అభిషేకాలు నిర్వహించి, ఆకుపూజ చేశారు. లక్ష్మీవైకుంఠనారాయణ స్వామి ఆలయ సన్నిధి, తుమ్మలపల్లి అంజనేయ స్వామి ఆలయ సన్నిధిలో దాతల సహకారంతో భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.
మల్దకల్, జూలై 28: ఆదిశిలా క్షేత్రంలో వెలిసిన స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయంలో 30వ తేదీ నుంచి ఆగస్టు 5వతేదీ వరకు ఆఖండ జ్యోతి సప్తాహ భజనలు ప్రారంభిస్తున్నట్లు ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, ఈవో సత్యచంద్రారెడ్డి తెలిపారు. ఏటా వర్షాలు సకాలంలో కురిసి రైతులు పాడిపంటలు సంవృద్ధిగా పండి సస్యశ్యామలంగా ఉండాలనే ఉద్దేశంతో భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. 7రోజులపాటు రాత్రింబవళ్లు భజనలు నిర్వహిస్తామన్నారు. భజనలో పాల్గొనే భక్తులు, భజన మండళ్ల సభ్యులకు ఆలయం ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం ఉంటుందన్నారు.