వనపర్తి జిల్లా విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. ఇప్పటికే అనేక విద్యాసంస్థలకు, పరిశోధనా కేంద్రాలకు కేంద్ర బిందువుగా మారిన జిల్లాకు మెడికల్ క్రిటికల్ కేర్ యూనిట్(సీసీయూ)తోపాటు హరిత ప్లాజా రానున్నది. అత్యున్నత ప్రమాణాలతో కూడిన పరికరాలు, నిష్ణాతులైన డాక్టర్ల పర్యవేక్షణలో 24గంటల వైద్య సేవలు అందుబాటులో ఉండేలా రూ.21 కోట్లతో యూనిట్ను నిర్మించనున్నారు. ఈమేరకు ఉత్తర్వులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నది.
వనపర్తి, జూలై 24 (నమస్తే తెలంగాణ): వనపర్తి జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్నది. ఇప్పటికే అనేక విద్యాసంస్థలకు, పరిశోధన కేంద్రాలకు కేంద్ర బిందువుగా మారిన వనపర్తి జిల్లాకు మెడికల్ క్రిటికల్ కేర్ యూనిట్తోపాటు హరితప్లాజా రానున్నది. సీఎం కేసీఆర్కు పరిస్థితులను వివరించి వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మంజూరు చేయించారు. వీటికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో రానున్నాయి. హైదరాబాద్కు దూరంగా ఉన్నందున ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాపాయస్థితికి చేరుకుని విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు.
ప్రమాదానికి గురైన వారి ప్రాణాలు పోకుండా కాపాడేందుకు ఈ మెడికల్ క్రిటికల్ కేర్ యూనిట్ను నిర్మిస్తున్నారు. అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్య పరికరాలు, నిష్ణాతులైన డాక్టర్ల పర్యవేక్షణలో 24గంటల వైద్యసేవలు అందుబాటులో ఉంటాయి. ఈ కేర్ యూనిట్ను రూ.21కోట్లతో నిర్మించనున్నారు. అంతర్జాతీయ సౌకర్యాలతో నిర్మిస్తున్నారు.
వనపర్తి నుంచి కొత్తకోట మార్గంలో దీనిని నిర్మించేందుకు స్థలాన్ని గుర్తించారు. దీంతోపాటు జిల్లాకేంద్రంలో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల సమీపాన ఇంజినీరింగ్, మెడికల్, నర్సింగ్ కళాశాలలు నిర్మిస్తున్న ప్రాంతాల్లో హరిత ప్లాజా నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. మంత్రి నిరంజన్రెడ్డితోపాటు జిల్లా ఉన్నతాధికారులు ఈ మేరకు ప్రతిపాదనలు పంపారు. ఈ సంవత్సరంలోనే జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేస్తూ విద్యామండలి అనుమతులు ఇచ్చింది.
మంత్రి నిరంజన్రెడ్డి కృషితో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీచేశారు. ఇది దక్షిణ తెలంగాణలో మొట్టమొదటి ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల కావడం గమనార్హం. ఎంసెట్ ర్యాంకు ఆధారంగా ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ కళాశాలను ప్రస్తుతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొలి పాలిటెక్నిక్ కళాశాలగా 1958లో ఏర్పాటుచేసిన భవనంలో తాత్కాలికంగా తరగతులు నిర్వహించనున్నారు.
రెగ్యులర్ క్యాంపస్ నిర్మాణం జరిగే వరకు పాలిటెక్నిక్ కళాశాలలోనే ఇంజినీరింగ్ తరగతులు ఉంటాయి. ఇప్పటికే మెడికల్ కళాశాలకు కేటాయించిన స్థలం సమీపంలో ఇంజినీరింగ్ కళాశాలకు 40ఎకరాల స్థలాన్ని కేటాయించారు. వనపర్తికి మెడికల్, ఇంజినీరింగ్ కళాశాల ఇస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే మెడికల్ కళాశాల మంజూరు చేయగా ప్రస్తుతం ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేసి మాట నిలబెట్టుకున్నారు. అదేవిధంగా జిల్లాలో మత్య్సకళాశాలను కూడా ఇటీవలే మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్ ప్రారంభించారు.
వనపర్తి మెడికల్ హబ్గా రూపాంతరం చెందుతున్నది. ఇప్పటికే జిల్లా దవాఖాన 100పడకలతో సేవలందిస్తున్నది. రేవల్లిలో 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నడుస్తున్నది. ఇటీవల జిల్లాకేంద్రంలో 20పడకలతో ప్రత్యేక నవజాత సంరక్షణ కేంద్రాన్ని మంత్రులు హరీశ్రావు, నిరంజన్రెడ్డి ప్రారంభించారు. అదేవిధంగా మెడికల్, నర్సింగ్ కళాశాలలు అందుబాటులోకి రానున్నాయి. వీటికి సంబంధించిన భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. వీటితోపాటు మాత శిశు మరణాల నియంత్రణలో భాగంగా జిల్లాలో రూ.17కోట్లతో 180 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని(ఎంసీహెచ్ సెంటర్) మంజూరైంది. జిల్లా ప్రజలకు వైద్యసేవలను అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో అవసరమైన వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారు.
వనపర్తి జిల్లాలో రూ.21కోట్లతో క్రిటికల్ కేర్ యూనిట్ నిర్మిస్తున్నాం. దీనిద్వారా జిల్లా ప్రజలకు ఎమర్జెన్సీ వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. రోడ్డు ప్రమాదాలు లేదా ఇతరత్రా ప్రాణాపాయ పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రాణాలు నిలిపేలా క్రిటికల్ కేర్ యూనిట్ను నిర్మిస్తాం. ఇందులో అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో సదుపాయాలు అందుతాయి. ఇప్పటికే మెడికల్, నర్సింగ్ కళాశాల, జిల్లా వైద్యశాల, ఎంసీహెచ్ సెంటర్ నవజాత సంరక్షణ కేంద్రం తదితర వైద్య సౌకర్యాలున్నాయి. కొత్తగా క్రిటికల్ కేర్ యూనిట్ ప్రారంభం కానున్నది. తీవ్ర ప్రమాదాల సమయంలో హైదరాబాద్లోని కార్పొరేట్ దవాఖానలకు తీసుకెళ్లేలోపు విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. క్రిటికల్ కేర్ యూనిట్ వల్ల ప్రాణాపాయస్థితిలో ఉన్న కేసులన్నీ హైదరాబాద్కు వెళ్లకుండా ఇక్కడే వైద్యం అందించి ప్రాణాలను కాపాడే అవకాశాలున్నాయి. అదేవిధంగా హరితప్లాజాను కూడా జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేయబోతున్నాం. రెండు ప్రాజెక్టుల నిర్మాణం కోసం స్థలాలు గుర్తించాం. త్వరలో అనుమతులు రానున్నాయి. అనుమతులు వచ్చిన వెంటనే నిర్మాణాలు ప్రారంభమవుతాయి.
– నిరంజన్రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి