కొల్లాపూర్రూరల్, జూలై 2 : జూన్ మొదటి వారం నుంచే రుతుపవనాలు కొలువుదీరడంతో వర్షాలు కురిశాయి. దీంతో కొల్లాపూర్ రైతాంగం దుక్కులు దున్నేందుకు సన్నద్ధమయ్యారు. జూన్ 28వ తేదీ నుంచే సీఎం కేసీఆర్ రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాల్లో జమచేయడంతో రైతులు ఉత్సాహంగా సేద్యం పనుల్లో నిమగ్నమయ్యారు. పెట్టుబడుల సాయం చేతికి రావడంతో మేలురకాలైన విత్తనాల కొనుగోలు కోసం రైతులు వెతుకుతున్నారు. ఇప్పటికే మండలంలో 24 గంటల వ్యవధిలో వర్షాలు కురుస్తుండడంతో విత్తనాలు వేసేందుకు రైతులు ఉరకలెత్తుతున్నారు.
కొల్లాపూర్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని కోడేరు, పెద్దకొత్తపల్లి, కొల్లాపూర్, పెంట్లవెల్లి మండలాల్లో 1.20 లక్షల ఎకరాలు సాగుయోగ్యంగా ఉన్నాయి. కోడేరు మండలంలో 16,594 మంది రైతులు 35,100 ఎకరాలు, కొల్లాపూర్ మండలంలో 15,104 మంది రైతులు 29,540 ఎకరాలలో, పెద్దకొత్తపల్లి మండలంలో 20,590 మంది రైతులు 44,800 ఎకరాలు, పెంట్లవెల్లి 5,211 మంది రైతులు 11,400 ఎకరాలలో సాగుచేస్తున్నారు. కాగా అయా మండలాల్లో ఇప్పటికే ప్రభుత్వం సిద్ధం చేసిన రైతుల వేదికల వద్ద వ్యవసాయాధికారులు రైతులతో సమావేశాలు నిర్వహించి వానకాలం పంటలపై అవగాహన కల్పిస్తున్నారు.
అలాగే అధునిక పద్ధతులలో వ్యవసాయం ఎలా చేయాలనే దానిపై అనుభవజ్ఞులైన వారిచేత శిక్షణ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. రైతులకు ప్రభుత్వం ముందుచూపుతో ఏర్పాటుచేసిన రైతువేదిక భవనాలు రైతు శిక్షణా కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి. కొల్లాపూర్ వ్యవసాయ డివిజన్లోని 56,400 మంది రైతులకు రూ.60.42 కోట్లు రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లో నేరుగా ప్రభుత్వం జమచేసింది.
కొల్లాపూర్ డివిజన్లో అత్యధికంగా పెద్దకొత్తపల్లిలోనే రైతులు ఎక్కువగా ఉండడంతో రూ.22.40కోట్లు మంజూరయ్యాయి. కోడేరుకు 17.55కోట్లు, కొల్లాపూర్కు రూ.14.77కోట్లు, అలాగే పెంట్లవెల్లి మండలానికి రూ.5.70 కోట్లు రైతుబంధు డబ్బులు ప్రభుత్వం నుంచి మంజూరయ్యాయి. రైతులు భూసారం పెంచుకోవడానికి వ్యవసాయాధికారుల సలహాల మేరకు జీనుగ విత్తనాలు వేసుకుని ఆ పైరును భూమిలో కలియదున్నేందుకు సిద్ధమవుతున్నారు.
వానకాలం పంటకోసం ప్రభుత్వం జీనుగ, వరి, కందులు, మొక్కజొన్న విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచింది. విత్తనాలు కావాల్సిన రైతులు ఆయా సింగిల్ విండో సొసైటీల ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆగ్రో రైతుసేవా కేంద్రాలు, ప్రైవేటు ఏజెన్సీల వద్ద విత్తనాలు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.
కొల్లాపూర్ వ్యవసాయ డివిజన్లో మొత్తం 84 మంది విత్తన డీలర్లకు అనుమతులున్నాయి. కొల్లాపూర్లో 26, పెంట్లవెల్లి మండలంలో 18, కోడేరు మండలంలో 15, పెద్దకొత్తపల్లి మండలంలో 25 దుకాణాలకు విత్తనాలు విక్రయించేందుకు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయి. ప్రభుత్వం ఎరువులను కూడా రైతులకు అందుబాటులో ఉంచింది. యూరియా, డీఏపీ, పొటాష్, కాంప్లెక్స్ అన్ని సొసైటీలకు అలాట్ మెంట్ అయ్యింది.
– నాగరాజు, వ్యసాయాధికారి, కొల్లాపూర్