నాగర్కర్నూల్, జూలై 2: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా అందజేసే పాఠ్యపుస్తకాలు జిల్లాకేంద్రం నుంచి మండలాలకు చేరుకున్నాయి. విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేసేందుకు జిల్లా విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2022-23విద్యా సంవత్సరంలో మన ఊరు-మనబడి కార్యక్రమంలో కొత్త ప్రవేశాలు పొందిన వారితోపాటు ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించనున్నారు. పుస్తకాల కొరత లేకుండా విద్యా సంవత్సరం బోధన సాఫీగా జరిగేలా విద్యాశాఖ చర్యలు తీసుకుంటున్నది.
జిల్లాకు అవసరమైన 5,05,300 పాఠ్యపుస్తకాల ప్రతిపాదనలను విద్యాశాఖకు పంపింది. దీంతో ఇప్పటివరకు వచ్చిన 1,76,819 పుస్తకాలను జిల్లా గోదాం నుంచి మండలాలకు పంపిణీ కార్యక్రమాన్ని శనివారం డీఈవో ప్రారంభించారు. జిల్లాలోని ప్రభుత్వ జెడ్పీ, ఉన్నత, కేజీబీవీ, మోడల్ పాఠశాలలతోపాటు సంక్షేమ, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలను అందజేయనున్నారు.
ఆయా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మొత్తం 5,05,300 పుస్తకాలు అవసరమని జిల్లా విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. గత విద్యా సంవత్సరం పంపిణీ చేయగా మిగిలిన 1,250 పాఠ్యపుస్తకాలు గోదాంలో మిగిలి ఉన్నాయి. జిల్లాకు 5,05,300ల పుస్తకాలు రావాల్సి ఉండగా, 1,76,819వచ్చాయి. ఇంకా 3,28,481 పుస్తకాలు రావాలి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా అందజేసే పాఠ్యపుస్తకాలను తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ఒకే పాఠ్యపుస్తకాన్ని ముద్రించనున్నందున పాఠ్యపుస్తకాలు ఆలస్యంగా వస్తున్నాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఎడమవైపు పేజీలో ఇంగ్లిష్, కుడివైపు పేజీలో తెలుగు లేదా ఆయా విద్యార్థులకు సంబంధించి మాతృభాషలో ముద్రణ ఉన్నాయన్నారు.
సర్కారు పాఠశాలల్లో 1నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టిన నేపథ్యంలో విద్యార్థుల సౌలభ్యం కోసం విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నదని డీఈవో పేర్కొన్నారు. ఇంగ్లిష్ సరిగా అర్థం కాని విద్యార్థులు తమ మాతృభాషలో ఉన్న పాఠాన్ని చదువుకోవడం ద్వారా సులభంగా అర్థం చేసుకోవచ్చని డీఈవో పేర్కొన్నారు. ప్రస్తుతానికి 1నుంచి 8వ తరగతుల వరకు అన్ని సబ్జెక్టుల పుస్తకాలను రెండు భాషల్లో తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్ తదితర భాషా పుస్తకాలు మాత్రం ఎప్పటి మాదిరిగానే ఒకేభాషలో ఉంటాయన్నారు.
వీటిని మినహాయించి సైన్స్, గణితం, సాంఘికశాస్త్రం పుస్తకాలను ద్విభాషల్లో ఉన్నాయన్నారు. 3,4,5తరగతుల్లో పరిసరాల విజ్ఞానం, 6,7,8 తరగతుల్లో గణితం, సైన్స్ సోషల్ స్టడీస్ పుస్తకాలను ద్విభాషలో అందుబాటులోకి వచ్చాయన్నారు. జిల్లాకు చేరుకున్న పాఠ్యపుస్తకాలను వచ్చినవి వచ్చినట్లుగానే మండలాలకు పంపిణీ చేసి పాఠశాలల ద్వారా విద్యార్థులకు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని డీఈవో పేర్కొన్నారు.