నిరుద్యోగుల కల సాకారానికి పాలమూరు వేదికైంది. ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం మెగా జాబ్ మేళా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలోని 60ప్రముఖ ప్రైవేట్ కంపెనీలు పాల్గొనే ఈ మేళా ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలోని 6వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కనుండటం విశేషం. ఉమ్మడి పాలమూరులో చరిత్రాత్మకంగా తొలిసారిగా భారీ జాబ్ మేళా నిర్వహిస్తుండడం యువతకు ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచుతున్నది.
నాగర్కర్నూల్, జూలై 2 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల నిరుద్యోగుల కలలు నెరవేరేందుకు మహబూబ్నగర్ జిల్లా కేంద్రం వేదికగా నిలుస్తున్నది. ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ సహకారంతో రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ, ధృవ్ కన్సల్టింగ్ సర్వీసెస్ సంయుక్తంగా మెగా జా బ్మేళా నిర్వహించనున్నాయి.
ఇందులో రాష్ట్రం లో ప్రముఖమైన 60 కంపెనీలు పాల్గొననున్నా యి. ఈ మేళా ద్వారా 6 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేలా ఏర్పాట్లు చేశారు. ఏడో తరగతి సాధారణ విద్యార్హత నుంచి ఇంజినీరింగ్, ఎం.ఫార్మసీ వంటి ఉన్నత చదువులు చదివిన యు వతకు జాబ్ మేళాలో మంచి కొలువులు దక్కనున్నాయి. నిరుద్యోగ యువతీయువకులంతా జాబ్మేళాలో పాల్గొనేలా పాలమూరులోని జెడ్పీ మినీ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ జాబ్ మేళా జరగనున్నది.
మంత్రి శ్రీనివాస్గౌడ్ స్వయంగా ఈ మేళాను పర్యవేక్షిస్తున్నారు. మంత్రిగా ఉన్నత స్థానంలో ఉన్న ఆయన పాలమూరులోని యువతకు సాధారణ ఉద్యోగాలతోపాటు సాఫ్ట్వేర్, ఇతర ప్రైవేట్ కంపెనీల్లో మంచి వేతనాలతో కూడిన ఉద్యోగాలు ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలో తనకున్న పేరును నిరుద్యోగ యువత కుటుంబాల్లో వెలుగులు నింపేలా ముందుకు సాగుతున్నారు. తన పరిధిలోని యువజన శాఖకు న్యాయం చేకూర్చేలా జాబ్మేళా నిర్వహణకు కార్యాచరణ రూపొందించారు. దీనికోసం ఏడు, పది, ఇంటర్, డిగ్రీ, పీజీ వంటి చదువులతోపాటు బీఈ, బీటెక్, బీ పార్మసీ, ఎం ఫార్మసీ, హో టల్ మేనేజ్మెంట్ వంటి సాంకేతిక విద్యను అభ్యసించిన నిరుద్యోగులకూ జాబ్ మేళా ద్వారా ఉద్యోగాలు దక్కనున్నాయి.
అది కూడా సంవత్సరానికి రూ.1.80 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు మం చి వేతనాలతో కూడిన ఉద్యోగాలు ఉండటం గమనార్హం. ఇప్పటికే జాబ్ మేళాపై విస్తృత ప్రచారం నిర్వహించారు. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వా రా ఉమ్మడి పాలమూరులోని గ్రామీణ ప్రాంతాలకూ సమాచారం అందించేలా ఆయా జిల్లాల యువజన సర్వీసుల శాఖ చర్యలు అధికారులు తీ సుకున్నారు. ఆన్లైన్ ద్వారా కూడా పేర్లు నమోదు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు.ఉమ్మడి పాలమూరులోనే తొలిసారిగా ఇలా 6వేల ఉద్యోగాలకు భారీ జాబ్మేళా నిర్వహిస్తుండడం చారిత్రాత్మకం గా మారుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు చర్యలు తీసుకుంటున్నది. ఈ క్రమంలో ప్రైవేట్ రంగంలోనూ వేలాదిగా ఉద్యోగాల కల్పన జరుగుతున్నది. వివిధ కార్పొరేట్, ఐటీ కంపెనీల ఉద్యోగాల్లో పాలమూరు యువతకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడిన మంత్రి శ్రీనివాస్గౌడ్ యువజన సర్వీసుల శాఖ, ధృవ్ కన్సల్టింగ్ సహకారంతో జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. దీంతో పాలమూరు గ్రామీణ యువతకు కార్పొరేట్ స్థాయిలో మంచి వేతనాలతో కూడిన ఉద్యోగాలు దక్కుతాయి. ఈ ఉద్యోగాల కోసం హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లి దరఖాస్తు ఫారాలు ఇచ్చి, రోజుల తరబడి ఎదురుచూడడం, మధ్యవర్తులను, ఏజెన్సీలను ఆశ్రయించడంవంటి బాధలు నిరుద్యోగ యువతీయువకులు అనుభవిస్తున్నారు.
అలాంటి యువతకు నమ్మకంతో కూడిన ఉద్యోగాలు కల్పించేందుకు మంత్రి ఆయా కంపెనీలనే నేరుగా పాలమూరుకు రప్పించి స్థానికంగానే అప్పటికప్పుడే కొలువులు దక్కేలా భారీ జాబ్మేళా నిర్వహిస్తుండడంపై హర్షం వ్యక్తమవుతున్నది. సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు సైతం ఇక్కడే నియామకాలు జరుగుతుండడం ప్రత్యేకంగా నిలుస్తున్నది. జాబ్ మేళాకు నిరుద్యోగ యువత తమ విద్యార్హత, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు, కులం ఒర్జినల్, జిరాక్స్ సర్టిఫికెట్లతో హాజరుకావాల్సిందిగా సూచిస్తున్నారు. మొత్తమ్మీద భారీ మెగా జాబ్మేళా నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనకు పాలమూరు వేదికగా నిలుస్తున్నది.
పాలమూరులోని యువతకు సాఫ్ట్వేర్ రంగంలోనూ ఉద్యోగాలు కల్పించేలా మెగా జాబ్మేళా నిర్వహిస్తున్నాం. ఉమ్మడి పాలమూరులోని యువత సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వం రాష్ట్రంలో 1.33 లక్షల ఉద్యోగాలు కల్పించింది. తాజాగా మరో 80 వేల ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రైవేట్ కంపెనీల్లో 15 లక్షల ఉద్యోగాలు దక్కాయి. ఇప్పటికే నాలుగు జిల్లాల్లో యువజన సర్వీసుల శాఖ జాబ్మేళా నిర్వహించింది. ప్రముఖమైన 60 కంపెనీలను పాలమూరుకు రప్పించి ఇక్కడి యువతకు 6 వేల మందికి ఉద్యోగాలు దక్కేలా చర్యలు తీసుకుంటున్నాను. త్వరలో పోలేపల్లి సెజ్లో కూడా స్థానికులకు ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకుంటాను.
– శ్రీనివాస్గౌడ్, ఎక్సైజ్, యువజన, క్రీడాశాఖ మంత్రి