మహబూబ్నగర్, జూలై 2 : హరితహారం కార్యక్రమం లో పెద్దఎత్తున మొక్కలను నాటేందుకు అన్నిశాఖల అధికారులు సిద్ధం కావాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నా రు. కలెక్టరేట్లోని తన చాంబర్లో శనివారం అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. హరితహారంలో భాగంగా ఇరిగేషన్, దేవాదాయ భూముల్లో 10లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
జిల్లావ్యాప్తంగా కనీసం 5లక్షల మొక్క లు, దేవాదాయ భూముల్లో మరో 5లక్షల మొక్కలు నా టేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. 5వ తేదీన ఇరిగేషన్ భూములు, 6న దేవాదాయ భూములను గుర్తించాలని తెలిపారు. లీజుకు తీసుకున్న రైతుల భూముల్లో కూడా పెద్దఎత్తున మొక్కలు నాటాలని సూచించారు. పొలంగట్లు, చెరువు గట్లపై టేకు, బొప్పాయి వంటి మొక్కలు నాటాలన్నారు.
నీటిపారుదల శాఖ పరిధిలోకి వచ్చే భూ ముల్లో 110 సైట్లను గుర్తించినట్లు తెలిపారు. కరివెన, ఉదండాపూర్ రిజర్వాయర్లతోపాటు అన్ని చెరువులు, చెరువు కట్టలు, గట్లు అన్నింటిలో బ్లాక్ ప్లాంటేషన్ చేపట్టనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. అన్ని స్థలాల్లో బ్లాక్ ప్లాంటేషన్ చేపట్టాలని, ప్రతి చెరువుకు ఇరిగేషన్ శాఖ నుంచి ఒకరిని ఇన్చార్జిగా నియమించాలని తెలిపారు. డీఆర్డీవో తరఫున ఒకరిని నియమించి పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. మొక్కల పెంపకంపై ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, డీఎఫ్వో గంగిరెడ్డి, డీఆర్డీవో యాదయ్య, ఇరిగేషన్ ఇంజినీర్లు, దేవాదాయ శాఖ అధికారులు ఉన్నారు.