మహబూబ్నగర్, జూలై 2 : ఏ పని చేసినా లాభం ఉండాలి. ఎలాంటి వ్యాపారం చేసినా తక్కువ పెట్టుబడి, శ్రమతో అధిక లాభాలు అర్జించేలా చూసుకుంటా రు. ఈ తరుణంలో కొందరు రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన లేక దుక్కి దున్నాలే.. సాగు చేయాలే.. పండితే దేవుడి దయ లేదంటే ఏం చేస్తాం మా కర్మ అం టూ కాలం వెల్లదీస్తున్న రోజులకు కాలం చెల్లింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆ ఆలోచనలకు తావు లేకుండా ప్రభుత్వం వ్యవసాయశాఖ అధికారులతో రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి సలహాలు, సూచనలు ఇస్తున్నది.
భూసారం పెం చేందుకు పరీక్షలు చేయడంతోపాటు రైతు పండిస్తున్న పంట విషయంలోనూ అవగాహన కల్పిస్తున్నది. వాణిజ్య పంటలను మాత్రమే పండించాలంటూ పలు పంటలపై రాయితీలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నది. మహబూబ్నగర్ జిల్లాలో పత్తి సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకున్నది. అందు లో భాగంగా జిల్లాలోని బాలానగర్ మండలం పెద్దరేవల్లిని క్లస్టర్గా ఎంపిక చేసింది. ఈ క్లస్టర్ పరిధిలో ఏడు గ్రామాలు ఉండగా 100ఎకరాల్లో పత్తి సాగు చేసేందు కుగానూ అధికారులు రైతులకు అవగాహన కల్పించారు.
మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కువగా పత్తి పంటను సాగుచేసేందుకుగానూ బాలానగర్ మండలం పెద్దరేవల్లి క్లస్టర్ను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ క్లస్టర్ పరిధిలోని 100ఎకరాల్లో పత్తిసాగు చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. రైతులకు ప్రభు త్వం రాశి కంపెనీ ఉత్పత్తి చేసిన పత్తి విత్తనాలను అందజేస్తున్నది. సాధారణ పత్తిసాగు చేస్తే ఎకరాకు 2 ప్యాకెట్ల పత్తి విత్తనాలు అవసరం. కానీ, ప్రభుత్వం సూచించిన అధికసాంద్రత పత్తిసాగుకు 5 ప్యాకెట్లు అవసరం ఉంటుంది. అధిక సాంద్రత పద్ధతిలో పత్తిసాగు చేయ డంతో అధిక లాభాలు గడించవచ్చని నిరూపించి అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పత్తిసాగుతోపాటు ఆరుతడి పంటలను అధికంగా సాగుచేసేందుకు వ్యవసాయశాఖ అధికారులు సూచనలు, సలహాలు ఇస్తూ ఆ దిశగా రైతుల ను ప్రోత్సహిస్తున్నారు.
సాధారణంగా రైతులు పత్తిసాగు చేస్తే 90సెం.మీ దూరంలో మొక్కలు నాటుతూ ఎకరాకు 6నుంచి 7వేల లోపు నాటుతారు. ఈ విధానంలో అధికంగా భూమి వృథా కావడంతోపాటు ఆ భూమిలో కలుపు తీసేందుకు కూడా ఇబ్బందులు ఉంటాయి. నూతన పద్ధతిలో సాగు చేయడం వల్ల ఎకరాకు ఐదు ప్యాకెట్ల పత్తి విత్తనాలు అవసరమవుతాయి. 20సె.మీ దూరం లో పత్తి విత్తడంతో ఎకరాకు 25వేల నుంచి 26వేల మొక్కలను నాటేందుకు అవకాశం ఉంటుంది.
విత్తనం విత్తుటకు దూరం తక్కువగా ఉండడంతో మొదళ్లలో కలుపు తక్కువగా వస్తుంది. సాధారణ పత్తి సాగుకంటే అధిక సాంద్రత పద్ధతిలో సాగుచేసే పత్తి విషయంలో కొంత మేరకు అధిక ఖర్చు అయినప్పటికీ ప్రభుత్వం ఆ ఖర్చును భరిస్తుంది. పత్తి విత్తనాలు వేసిన వెంటనే వ్యవసాయ అధికారి వచ్చి ఆ ఫొటోలను తీసుకొని ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. దీంతో రైతు ఖాతాలో రూ.2,187 జమ చేస్తారు. విత్తనాలు నాటిన రోజు నుంచి 45రోజులకు రూ.500, 65నుంచి 75రోజుల మధ్యకాలంలో రూ.1,313 అందించేందుకు ప్రభు త్వం చర్యలు తీసుకుంటుంది. ఈ ప్రాంతంలో పత్తిసాగు చేయించేందుకు వ్యవసాయ అధికారులు ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.
పత్తిసాగు పెంచేందుకు ప్రభుత్వ సూచనల మేరకు రైతులకు అవగాహన కల్పించి ప్రోత్సహిస్తున్నాం. అధిక సాంద్రత పద్ధతిలో పత్తిసాగు చేసేందుకు బాలానగర్ మండలం పెద్దరేవల్లిని క్లస్టర్గా ఎంపిక చేశారు. ఈ ప్రాంతంలో 100 ఎకరాల్లో సాగును చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రణాళిక మేరకు పత్తిసాగును నూతన విధానంలో అమలు చేసేందుకు ప్రతి రైతుకు సూచన, సలహాలను ఇస్తున్నాం. ఈ ఏడాది పత్తిసాగును మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– వెంకటయ్య, వ్యవసాయ అధికారి, మహబూబ్నగర్