మరికల్, జూన్ 22: ప్రజాసంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని, అధికారమే ధ్యేయంగా దేవున్ని సైతం అమ్మే పార్టీ బీజేపీ అని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస్ రాజేందర్రెడ్డి అన్నారు. దేశంలో దివాళాకోరు పార్టీ కాం గ్రెస్ అని ఆరోపించారు. మండలకేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. ప్రజలమధ్య మత చిచ్చు పెట్టి హిందూ, ముస్లింల మధ్య ఘర్షణలు ప్రేరేపించడమే ధ్యేయంగా బీజేపీ మారిందన్నారు. టీఆర్ఎస్ పార్టీలకు, మతాలకు అతీతంగా అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు.
జిల్లాలో మరికల్ మండలం మరింత అభివృద్ధి చెందుతున్నదని ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఏకైక హైవేలైన్, రైల్వేస్టేషన్ ఉన్న మండలం మరికల్ అన్నారు. నాయకులు పార్టీలకతీతంగా మండలాన్ని మరింత ఆభివృద్ధి చేసుకోవాలన్నారు. గ్రూపు తగాదాలకు తావు లేకుండా అభివృద్ధి వైపు పరుగులు పెట్టాలన్నారు. సమస్యలు పరిష్కరించుకుంటే 2029నాటికి మరికల్ నియోజకవర్గ కేంద్రంగా మారుతుందన్నారు.
అధికారం అనేది తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి కాదని, ఎన్నికల్లో ప్రజలు పెట్టిన భిక్ష అన్నారు. అధికారం ఈరోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు కానీ, ప్రజలకు చేసిన సేవ ఎప్పటికీ గుర్తుంటుందని ఎమ్మెల్యే ఎస్ఆర్రెడ్డి అన్నారు. అదేవిధంగా మండలంలోని పెద్దచింతకుంటకు చెందిన కృష్ణమూర్తికి ఎమ్మెల్యే ఎస్ రాజేందర్రెడ్డి సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.60వేల విలువగల చెక్కును పంపిణీ చేశారు.
బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి టీఆర్ఎస్ పార్టీలకతీతంగా పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో వైస్ఎంపీపీ రవికుమార్, సర్పంచ్ కస్పే గోవర్ధన్, ఎంపీటీసీలు గోపాల్, సుజాత, పార్టీ నాయకులు వెంకట్రెడ్డి, సంపత్కుమార్, రాజవర్ధన్రెడ్డి, లక్ష్మయ్య, కొండారెడ్డి, బసంత్, రామస్వామి, రాములు, జగదీశ్, కృష్ణారెడ్డి, చంద్రశేఖర్, తిరుపతయ్య, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.