మహబూబ్నగర్, ఏప్రిల్ 28 : రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తనీయమని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లా బైపాస్ రోడ్డు, మార్కెట్ యార్డులో వరి కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. మార్కెట్ యార్డును పరిశీలించి పలువురు రైతులతో ముచ్చటించారు. గన్నీ బ్యాగులను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్షకులకు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యనూ పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తామన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో పండించిన ధాన్యం విక్రయించేందుకు రైతులకు ఇబ్బందులు కలిగించకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారని తెలిపారు. కేంద్రాలకు పరిశుభ్రమైన ధాన్యాన్ని మాత్రమే తీసుకురావాలని సూచించారు. ఎక్కడా ఎలాంటి సమస్యలు లేకుండా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ధాన్యం విక్రయాలు జరపాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద తాగునీటితోపాటు తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు. నిర్లక్ష్యానికి తావివ్వొద్దన్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అమరేందర్రాజు, డీసీసీబీ వైస్ చైర్మన్ కొరమోని వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
రెడ్క్రాస్కు హెటిరో ట్రై సైకిళ్ల వితరణ
సాంధీ పని ఆవాసంలో ఉన్న దివ్యాంగ చిన్నారులకు హెటిరో డ్రగ్స్ సంస్థ యాజమాన్యం అందించిన పది ట్రై సైకిళ్లను మంత్రి శ్రీనివాస్గౌడ్ పంపిణీ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని రెడ్క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దివ్యాంగులకు ట్రై సైకిళ్లు అందజేసిన హెటిరో యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. ఇలాంటి బృహత్తర కార్యక్రమాలు రాబోయే రోజుల్లో మరిన్ని చేయాలని సూచించారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ చైర్మన్ నటరాజ్, హెటిరో సంస్థ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ డాక్టర్ శామ్యూల్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వైస్ చైర్మన్ తాటి గణేశ్, కౌన్సిలర్లు, హెటిరో సంస్థ సిబ్బంది ఫణీంద్ర, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.