మహబూబ్నగర్, జూన్ 27: ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో ఒకసారి మీ అంతరాత్మను అడగాలని మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మున్సిపల్ వైస్చైర్మన్ తాటి గణేశ్, టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ షబ్బీర్అహ్మద్, కౌన్సిలర్లు కట్టా రవికిషన్రెడ్డి, అనంతరెడ్డి, కిశోర్, రాము, శ్రీనివాసులుతో కలిసి చైర్మన్ మాట్లాడారు. మాజీ మంత్రి డీకే అరుణ మంత్రిగా ఉన్న సమయంలో జిల్లా అభివృద్ధికి ఏం చేశారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధికి అహర్నిశలు పని చేస్తున్న మంత్రి శ్రీనివాస్గౌడ్ను విమర్శించేస్థాయి డీకే అరుణకు లేదన్నారు. డీకే అరుణ మంత్రిగా ఉన్నప్పుడు తన అభివృద్ధే ధ్యేయంగా పని చేశారని ధ్వజమెత్తారు. మహబూబ్నగర్కు రావాల్సిన బైపాస్రోడ్డును గద్వాలకు తీసుకుపోయిన ఘనత మీది కాదా అని ప్రశ్నించారు. అన్నివర్గాల అభ్యున్నతి, రాష్ర్టాభివృద్ధే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుండగా.. ప్రజలకు మాయమాటలు చెప్పి కాలం వెల్లదీయడం మీ వంతు అయ్యిందని విమర్శించారు. నోరు అదుపులో పెట్టుకుని డీకే అరుణ మాట్లాడాలని హితవు పలికారు. భారత్మాలపై ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బీజేపీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, ఇది సరికాదన్నారు. ఆర్డీఎస్పై నిజమైన పోరాటం చేసింది తెలంగాణ ప్రభుత్వమన్నారు. ప్రతి ఎకరాకూ సాగునీరు, ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. మరికొందరు సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు. మాజీ మంత్రి డీకే అరుణ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ పోలీసులకు రాతపూర్వకగా ఫిర్యాదు చేస్తామని స్పష్టంచేశారు. సమావేశంలో నాయకులు శ్రీనివాస్రెడ్డి, ప్రశాంత్ తదితరులు ఉన్నారు.